calender_icon.png 26 October, 2024 | 7:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబానీతో అనుబంధం లేదు

16-07-2024 12:10:00 AM

ఇటీవల జరిగిన అనంత్ అంబానీ, రాధికల వివాహ వేడుక వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అంబానీ ఇంట ముంబైలో మోగిన ఈ పెళ్లి బాజాలు దేశమంతటా ప్రతిధ్వనించాయి. 5 వేల కోట్ల రూపాయలతో జరిగిన ఈ కార్యక్రమానికి అతిథులుగా ప్రపంచం నలుమూలల నుండి ఎంతోమంది వివిధ రంగాలకు చెందిన ఘనులు విచ్చేశారు. పలువురు సినీ తారలు సైతం అంబానీ ఆహ్వానం మేరకు ఆయన ఇంట సందడి చేశారు. ఈ తరుణంలో బాలీవుడ్‌లో కథానాయికగా తనదైన ప్రయాణం సాగిస్తున్న తాప్సీ, అనంత్ వివాహానికి హాజరుకాలేదు. అందుకు గల కారణాలను ఆమె చెప్పుకొస్తూ “అంబానీ కుటుంబంతో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి అనుబంధం లేదు.

ఆతిథ్యం ఇచ్చే కుటుంబానికీ, అతిథికి మధ్య ఏదో రకమైన అనుబంధం ఉండాలని నేను అనుకుంటాను. అటువంటి కార్యక్రమాలకి మాత్రమే నేను హాజరవుతాను” అని అన్నారు. వ్యక్తిగత, కుటుంబ విషయాలను బయటపెట్టడం ఇష్టపడని తాప్సీ, తన వివాహం సమయంలోనూ “తమ పెళ్లి ఫొటో, వీడియోలను సామాజిక మాధ్యమాలలో పెట్టబోమని” స్పష్టంగా తెలియజేసింది. ఏదేమైనా అంబానీ వివాహ వేడుకపై తాప్సీ చేసిన ఈ వ్యాఖ్యలు అంతటా చర్చనీయంగా మారాయన్నది అసలు విషయం.