ఇండస్ట్రీలో ఏదైనా సినిమాకు కథ ఓకే అయినప్పటి నుంచి మొదలు చిత్రీకరణ ప్రారంభమై గుమ్మడికాయ కొట్టే వరకూ ఉండే హడావుడి అంతా ఇంతా కాదు. నిత్యం ఏదో ఒకరకంగా తమ చిత్రాన్ని ప్రేక్షకుల నోళ్లలో నానేలా చేస్తూ ఉంటారు. నిత్యం వార్తల్లో నిలిచేలా చూస్తారు. కానీ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ నటిస్తున్న తాజా చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.
పేరుకు తగ్గట్టే ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఎప్పుడు చిత్రీకరణ జరుపుకుందో తెలియదు. విడుదల తేదీని మాత్రం ప్రకటించేశారు. ఇదే ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ చిత్రంలో దివ్యాంశ, రుక్మిణి వసంత్లు కథానాయకలుగా నటిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు తెలియజేస్తూ చిత్ర యూనిట్ ఒక పోస్టర్ను విడుదల చేసింది.
సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎస్వీసీసీ పతాకంపై నిర్మితమైంది. అయితే ఈ చిత్ర షూటింగ్ రెండేళ్ల క్రితమే పూర్తుందని కొందరు చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రచార ఆర్భాటాలకు పోకుండా నేరుగా చిత్ర విడుదల తేదీని ప్రకటించడం చిత్ర యూనిట్కు సినిమాపై ఉన్న నమ్మకానికి ప్రతీక అని నిఖిల్ అభిమానులు అంటున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని చిత్ర బృందం విశ్వసిస్తోంది.