హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): నగరంలోని సైదాబాద్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. ఆదివారం సైదాబాద్ ప్రాంతంలోని శంఖేశ్వర్ బజార్ గ్రీన్ వ్యూ అపార్ట్మెంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. సోదాలు సుమారు గంట పాటు కొనసాగాయి. ఎన్ఐఏ అధికారులు ఆగస్టులో ఉగ్రవాది రిజ్వాన్ అబ్దుల్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నిందితుడు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్తో సంబంధం ఉన్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ఎన్ఐఏ గుర్తించింది.
నిందితు డు ఐసిస్ తరపున పుణె నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తుండేవాడు. రిజ్వాన్ ను ఢిల్లీలోని గంగాభక్ష్ మార్గ్ వద్ద అదుపులోకి తీసుకున్న స్పెషల్ సెల్ అరెస్ట్ సమయంలో అతడి నుంచి 30 బోర్ పిస్తోల్స్, మూడు కార్ట్రిడ్జ్లు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఢిల్లీలోని స్పెషల్ సెల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం ఎన్ఐఏ విచారణ చేపట్టింది. రిజ్వాన్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఆదివారం రిజ్వాన్ను వెంటబెట్టుకుని మరీ హైదరాబాద్లో ఎన్ఐఏ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.