రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమా రాజేశ్ ఖన్నా
హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం)లో పనిచేస్తున్న వివిధ రకాల వైద్య సిబ్బందిని ఎలాంటి షరతులు లేకుండా క్రమబద్ధీకరించాలని ఎన్హెచ్ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమా రాజేశ్ ఖన్నా డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అవుతున్నా ఎన్హెచ్ఎం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను సవరించలేదని, ఇప్పటికీ కనీస వేతనాలతోనే గడుపుతున్నట్టు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ప్రభుత్వం లాగే కాంగ్రెస్ సర్కారు కూడా తమ పట్ల నిర్లక్ష్య వైఖరినే ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న 17,514 మంది శ్రమదోపిడీకి గురవుతున్నారని, నాలుగో తరగతి ఉద్యోగుల కనీస వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలని ఖన్నా డిమాండ్ చేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించకుండా కాలయాపన చేస్తున్న సర్కారు తీరుకు నిరసనగా ఈ నెల 30న హైదరాబాద్ కోటీలోని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేయనున్నట్టు తెలిపారు. ఈ ధర్నాకు రాష్ట్రవ్యాప్తంగా ఎన్హెచ్ఎం సిబ్బంది అంతా హాజరవుతారని చెప్పారు.