calender_icon.png 1 October, 2024 | 5:07 AM

దసరాలోపే కొత్త టీచర్లు

01-10-2024 02:48:51 AM

  1. 55 రోజుల్లోనే డీఎస్సీ ఫలితాలు విడుదల
  2. 9న ఎల్బీ స్టేడియంలో డీఎస్సీ అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు

గత ప్రభుత్వం పదేండ్లలో 7 వేల టీచర్ పోస్టులే భర్తీ 

పది నెలల్లో తమ ప్రభుత్వం 11,062 పోస్టులు భర్తీ

ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియ 

100 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియని, కేవలం 55 రోజుల్లోనే డీఎస్సీ ఫలితాలను విడుదల చేశామని, అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తామని ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి ప్రకటించారు. నిరుద్యోగులకు ముందుగానే దసరా పండుగ రాబోతున్నదన్నారు.

గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం 7,857 టీచర్ పోస్టులతో ఒకే ఒక్క డీఎస్సీ (టీఆర్టీ) వేసిందని విమర్శించారు. తమ ప్రభుత్వం మొత్తంగా మొదటి ఏడాదిలోనే 60 నుంచి 65 వేల వరకు ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తున్నామని చెప్పారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో డీఎస్సీ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియని.. జాబ్ క్యాలెండర్‌ను అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ వృత్తి అనేది ఉద్యోగం కాదని, భావోద్వేగమని, ఒక బాధ్యతన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో కేవలం ఒకేసారి డీఎస్సీ నిర్వహిస్తే తమ ప్రజా ప్రభుత్వం పది నెలల్లోనే 11,062 టీచర్ పోస్టులకు డీఎస్సీ నిర్వహించిందన్నారు.

తెలంగాణలో దసరా పండుగ పెద్ద పండుగ అని, నిరుద్యోగులకు డీఎస్సీ ఫలితాలతో ముందే దసరా పండుగ వచ్చిందని సీఎం తెలిపారు. అక్టోబర్ 9న ఎల్బీస్టేడియంలో అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల  తర్వాత టెట్ నిర్వహించాలని నిరుద్యోగుల నుంచి విజ్ఞప్తి వస్తే మరోసారి కూడా టెట్ నిర్వహించగా డీఎస్సీ రాసేందుకు అదనంగా 1,09,168 మంది అభ్యర్థులు అర్హత సాధించారని చెప్పారు.

డీఎస్సీ పరీక్షలు జూలై 18వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు 26 సెషన్‌లలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)లను నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి పోస్టుకు 1:3 నిష్పత్తిలో అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన చేపడతామని వెల్లడించారు. టెట్, డీఎస్సీ నిర్వహణలో సమర్థంగా విధులు నిర్వహించారని విద్యాశాఖ అధికారులను సీఎం ఈ సందర్భంగా అభినందించారు.

జాబ్ క్యాలెండర్‌ను పక్కగా అమలు చేస్తాం

నిరుద్యోగలకు అండగా నిలవడం, ఉద్యోగ నియామకాలే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాల నియామక పత్రాలు అందించామని సీఎం చెప్పారు. జాబ్ క్యాలెండర్‌ను పక్కగా అమలు చేస్తామన్నారు. గ్రూప్ 2, 3 పోస్టులను అంగడి సరకుల్లా మార్చిన టీజీపీఎస్సీని తమ ప్రభుత్వంలో ప్రక్షాళన చేశామన్నారు. ఎటువంటి లోపాలు లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

మొత్తంగా 60 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపారు. గ్రూప్ మెయిన్స్ పరీక్షను త్వరితగతిన పూర్తి చేసి వెంటనే ఫలితాలను విడుదల చేస్తామన్నారు. డీఎస్సీ ఫలితాల్లో మంచి స్కోరు సాధించిన వారికి ఈ సందర్భంగా సీఎం అభినందనలు తెలిపారు. ఈ డీఎస్సీలో ఏమైనా ఖాళీలు ఏర్పడతాయో..లేదా అంచనా వేసి ఎన్ని పోస్టులతో మరోక డీఎస్సీ వేయాలనేది నిర్ణయిస్తామన్నారు.

అందరికీ ఒకేచోట ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు

పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా తెలంగాణవ్యాప్తంగా వంద నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలలు వేర్వురుగా ఉండడంతో పిల్లల్లో ఆత్మన్యూనత భావం ఏర్పడేదని.. దానిని తొలగించి వారి సమగ్ర వికాసానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వివరించారు.

ప్రస్తుత గురుకుల స్థానాల్లో కొత్త ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో.. రూ.వంద కోట్లతో ఒక్కో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. ఇప్పటికే కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైందని, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

పేదలకు విద్యను అందించాలనే ఆలోచన గత కేసీఆర్ ప్రభుత్వానికి లేదన్నారు. విద్యకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే డీఎస్సీ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నామని, తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శమని ముఖ్యమంత్రి తెలిపారు.  

విద్యకు ఎక్కువ నిధులు కేటాయిస్తాం

గత ప్రభుత్వం విద్యా శాఖను నిర్లక్ష్యం చేసిందని, బడ్జెట్ కేటాయింపులు తక్కువగా చేసేదని, తాము అధికారంలోకి వచ్చాక విద్యా శాఖకు నిధుల కేటాయింపు పెంచామని, భవిష్యత్‌లో నిధులు మరింతగా కేటాయిస్తామని సీఎం అన్నారు. గత ప్రభుత్వం కోళ్ల షెడ్లు, అద్దె గృహాల్లో వసతి గృహాలు ఏర్పాటు చేసిందని, కనీస మౌలిక వసతులు కల్పించలేదన్నారు.

పదేళ్లు ప్రభుత్వంలో ఉన్నవాళ్లు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంతోనే ఆ సమస్యలు వస్తున్నాయని  ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పుడు ఆయా పాఠశాలల్లో వసతులు లేవంటూ తమపై విమర్శలు చేస్తున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. అందుకే తమ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తోందన్నారు. గత ప్రభుత్వం ఏళ్ల తరబడి టీచర్ల ఉద్యోగోన్నతులు, బదిలీలు చేపట్టలేదని సీఎం విమర్శించారు.

తాము అధికారంలోకి వచ్చాక ఎటువంటి వివాదాలకు తావు లేకుండా 34 వేలకుపైగా బదిలీలు, 24,419 మందికి ఉద్యోగోన్నతుల ప్రక్రియ చేపట్టామని ఆయన తెలిపారు.  317 జీవో సమస్య ప్రభుత్వ పరిశీలనతో ఉందని, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియమంత్రణపై ప్రత్యేక కమిటీ ఇప్పటికే వేసిన విషయాన్ని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ర్ట మంత్రులు దామోదర రాజనరసింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, విద్యా శాఖ కమిషనర్ ఈవీ నరసింహారెడ్డి, అదనపు డైరెక్టర్ కె.లింగయ్య, మదన్‌మోషన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.