02-03-2025 12:44:48 AM
హైదరాబాద్, మార్చి 1 (విజయక్రాంతి): మహిళా సాధికారతకు, ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట వేస్తున్న సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం.. మహిళా దినోత్సవ వేదికగా కొత్త పథకాలను ప్రారంభించనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు.
మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో లక్షమందితో మహిళా దినోత్సవాన్ని ప్రభు త్వం నిర్వహించనున్న నేపథ్యంలో మంత్రి సీతక్క అధికారులతో సచివాలయంలో శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహంచారు. మహిళా సాధికారత కోసం కొత్తగా తీసుకోబోయే నిర్ణయాలపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ఆర్థిక రంగంలో తెలంగాణ గ్రామీణ మహిళలు సాధించిన విజయాలను ప్రపంచానికి చాటాలన్నారు. ముఖ్యంగా ప్రతీ జిల్లాల్లో మహిళా సంఘాలతో ఏర్పాటు కాబోయే సోలార్ విద్యుత్ ప్లాంట్లకు సీఎం వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నట్టు సీతక్క వెల్లడించారు.
మొత్తం 32 జిల్లాల్లో జిల్లాకొక 2 మెగావాట్ల చొప్పున మొత్తం 64 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. మహిళా స్వయం సహాయక బృందాలతో బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా ఇప్పటికే ఒప్పందాలు కుదిరినట్టు వెల్లడించారు. మొదటి విడతలో 50 ఆర్టీసీ అద్దె బస్సులకు పచ్చజెండా ఊపి, సీఎం చేతుల మీదుగా మార్చి 8న ప్రారంభించనున్నట్టు చెప్పారు.
అదేరోజు మరికొన్ని కార్యక్రమాలు!
మహిళా దినోత్సవం రోజు మరికొన్ని కీలక ప్రకటనలను సీఎం రేవంత్రెడ్డి చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వడ్డీ లేని రుణాల చెక్కులను మహిళా సంఘాలకు సీఎం రేవంత్రెడ్డి అందజేసే అవకాశం ఉంది. ఈ ఏడాది కాలంలో ప్రమాదవశాత్తు మరణించిన 400 మంది మహిళా సంఘ సభ్యుల కుటుంబాలకు రూ.40 కోట్ల ప్రమాద బీమా చెక్కులను అందజేయనున్నారు.
ఇక మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 14 వేలకు పైగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామక ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఇందిరా మహిళా శక్తి విధానాన్ని సీఎం ఈ సందర్భంగా విడుదల చేయనున్నారు. ఇవే కాకుండా మహిళా శక్తి ప్రాంగణాల్లో మహిళలకు ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ ఇచ్చిన నేపథ్యంలో ఆయా మహిళలకు సబ్సిడీలో ఆటోలు అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
పట్టణాల్లో మహిళా సంఘాలను బలోపేతం చేసేలా ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. సెర్ప్, మెప్మాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. వీటితో పాటు మహిళల భద్రత, ఆరోగ్యం, ఆర్థిక పటిష్టత కోసం మరిన్ని పథకాలను ప్రారంభించే అవకాశం ఉంది.
సమీక్షలో మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ వెన్నెల గద్దర్, తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ అలేఖ్య పుంజాల, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేశ్కుమార్, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, పంచాయతీరాజ్ డైరెక్టర్ సృజన, స్పెషల్ కమిషనర్ బీ షఫీఉల్లా, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ తదితరులు పాల్గొన్నారు.