09-04-2025 01:27:30 AM
హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): తెలంగాణలో 604 కొత్త మద్యం బ్రాండ్ల అమ్మకాల అనుమతి కోసం 92 మద్యం సరఫరా కంపెనీలు దరఖాస్తులు చేసుకున్నాయి. దేశ, విదేశీ మద్యం బ్రాండ్ల కోసం టీజీబీసీఎల్ దరఖాస్తులను ఆహ్వానించగా, ప్రస్తుతం మద్యం సరఫరా చేస్తున్న 45 కంపెనీలు 218 కొత్త రకాల మద్యం బ్రాండ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నాయి.
తెలంగాణలో మొదటిసారిగా కొత్త మద్యం బ్రాండ్ల అమ్మకాల కోసం మరో 47 కొత్త కంపెనీలు 386 రకాల కొత్త మద్యం బ్రాండ్లను తీసుకొచ్చేందుకు టీజీబీసీఎల్కు అర్జీ పెట్టుకున్నాయి. కాగా, కొత్త మద్యం బ్రాండ్లను తీసుకోవడానికి ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల మేరకు టీజేబీసీఎల్ ఫిబ్రవరి 23న నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొదట మార్చి 15 వరకు దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. కంపెనీల విజ్ఞప్తి మేరకు గడువును ఈనెల 2 వరకు పొడగించారు. ఈ దరఖాస్తుల పరిశీలన తర్వాత కొత్త బ్రాండ్లకు ప్రభుత్వం ఆమోదం తెలుపనున్నది.