హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 17 (విజయక్రాంతి): జీహెచ్ఎంసీ నూతన కమిషనర్గా డాక్టర్ కే ఇలంబర్తి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇలంబర్తి రవాణా శాఖ కమిషనర్గా పనిచేస్తుండగా, జీహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేసిన ఆమ్రపాలి కాట ఏపీ క్యాడర్కు వెళ్లడంతో ఇలంబర్తికి జీహెచ్ఎంసీ కమిషనర్గా ఎఫ్ఏసీ (ఫుల్ అడిషనల్ ఛార్జ్) బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు గురువారం ఆయన జీహెచ్ఎంసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్లు నళిని పద్మావతి, యాదగిరి రావు, పంకజ, వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ, సీసీపీ శ్రీనివాస్, జోనల్ కమిషనర్లు హేమంత్ కేశవ్ పాటిల్, అనురాగ్ జయంతి, అపూర్వ చౌహాన్, రవికిరణ్, వెంకన్న, చీఫ్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ రాంబాబు, సీపీఆర్వో ముర్తుజా అలీ కమిషనర్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జీహెచ్ఎంసీ కార్యాలయంలో నిర్వహించిన మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవంలో కమిషనర్ పాల్గొని వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.