calender_icon.png 11 October, 2024 | 4:55 PM

అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సు సర్వీసులు

11-09-2024 03:24:52 AM

  1. ఆర్టీసీ సంస్థ రుణ భారం తగ్గించాలి 
  2. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
  3. 83.42 కోట్ల మంది మహిళలు ఉచితప్రయాణం చేశారని వెల్లడి

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): రాష్ర్టవ్యాప్తంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సుల కొనుగోలుకు రంగం సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పెరిగిన అవసరాలు, నూతన మార్గాలను ప్రతిపాదికగా తీసుకోవాలని సూచించారు. టీజీఎస్‌ఆర్టీసీపై సచివాలయంలో సీఎం మంగళవారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి పథకం మహిళలు వినియోగించుకుంటున్న తీరుపై ఆరా తీశారు. మహాలక్ష్మి పథకం అద్భుతంగా ఉందని, ఇప్పటి వరకు 83.42 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, రూ.2,840.71 కోట్లు వారికి ఆదా అయ్యాయని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎంకు తెలిపారు.

ఆర్టీసీలో 7,292 బస్సుల్లో మహాలక్ష్మి పథకం వర్తిస్తోందని వివరించారు. మహాలక్ష్మి పథకం ప్రారంభమైన తర్వాత వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌లోని హాస్పిటల్స్‌కు వస్తున్న మహిళల సంఖ్య పెరుగుతోందని, అందుకు సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాలను ముఖ్యమంత్రికి అధికారులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌లో చూపారు. అనంతరం వివిధ బ్యాంకులు, ఉద్యోగుల భవిష్యత్ నిధి ఖాతా నుంచి వాడుకున్న నిధులు, విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు తదితరాలకు కలిపి రూ.6,322 కోట్ల రుణాలు ఉన్నట్టు అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు చెల్లిస్తున్న వడ్డీ రేటు ఎక్కువగా ఉందని..

వడ్డీ రేట్ల తగ్గింపు, అప్పుల రీకన్‌స్ట్రక్చన్‌పై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సంస్థపై క్రమంగా రుణభారం తగ్గించాలని సూచించారు. మహాలక్ష్మి పథకంతో ఆక్యుపెన్సీ రేటు పెరగడంతోపాటు ప్రభుత్వం చెల్లిస్తున్న రీయింబర్స్‌మెంట్‌తో సంస్థ లాభాల్లోకి వస్తోందని అధికారులు తెలిపారు. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం కార్యదర్శులు చంద్రశేఖర్‌రెడ్డి, షానవాజ్ ఖాసీం, రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.