04-04-2025 11:42:41 PM
జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి నందగోపాల్
మంచిర్యాల,(విజయక్రాంతి): జిల్లాలో రెండు నూతన బార్ లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కెజి నంద గోపాల్ కోరారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్ లో ఒక బార్ కు, బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఒక కొత్త బార్ లైసెన్సుల మంజూరికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. 2005 ఎక్సైజ్ నిబంధనల ప్రకారం గతంలో రాష్ట్రవ్యాప్తంగా మూతపడిన 25 బార్ల స్థానంలో కొత్త బార్లకు అనుమతి ఇవ్వగా జిల్లాలో రెండు బార్లకు అనుమతి ఇచ్చారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 26లోపు కలెక్టరేట్ లోని జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల మధ్య సమర్పించవచ్చునన్నారు. దరఖాస్తు రుసుముగా లక్ష రూపాయలు కాగా ఒక్కరు ఎన్ని దరఖాస్తులైనా చేసుకునే అవకాశం ఉందన్నారు. 29న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ విధానం ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందని, మరిన్ని వివరాలకు వెబ్సైట్ (https://tgbcl.telangana.gov.in) లో సందర్శించవచ్చునని, మరిన్ని వివరాలకు 87127 58773, 87126 58788, 87126 58785 నెంబర్లలో సంప్రదించవచ్చునన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, లక్షేట్టిపేట సీఐలు గురువయ్య, ఇంద్రప్రసాద్, హరి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.