calender_icon.png 28 September, 2024 | 1:02 PM

పర్యాటక ప్రాంతాలపై గత పాలకుల నిర్లక్ష్యం

28-09-2024 02:20:50 AM

  1. మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నాం
  2. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
  3. తెలంగాణ దర్శిని కార్యాక్రమం లాంఛనంగా ప్రారంభం

హైదరాబాద్, సెప్టెంబర్ 27(విజయక్రాంతి): పర్యాటక ప్రాంతాలపై గత పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు.

శుక్రవారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (నిథం)లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి జూపల్లి పాల్గొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు తెలంగాణ పర్యాటక ప్రదేశాలను సందర్శించి, టూరిజం ప్రమోషన్‌లో భాగస్వామ్యులు  కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ దర్శిని కార్యాక్రమాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.

అవార్డుల అందజేత.. 

యువ టూరిజం క్లబ్స్ ద్వారా తెలంగాణ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ,  పర్యాటకంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో విశేష కృషి చేసిన మహబూబ్‌నగర్, వరంగల్, జగిత్యాల జిల్లాల కలెక్టర్లు, పర్యాటకులకు ఆతిథ్య రంగంలో  విశేష సేవలు అందిస్తున్న రెస్టారెంట్, హోటల్ నిర్వాహకులకు మంత్రి అవార్డులు అందజేశారు.

విద్యార్థినులు, కళాకారులు ప్రదర్శించిన శివప్రియం, కాకతీయం, కూచిపూడి, పేరిణి నృత్య రూపాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ పాల్గొన్నారు.