calender_icon.png 15 October, 2024 | 3:50 PM

రోగులపట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేదే లేదు

15-10-2024 01:33:58 PM

దున్నపోతుపై వర్షం పడినట్టు ప్రభుత్వ పరిస్థితి ఉంది

ముఖ్యమంత్రికి కోపం ఉంటే మా మీదే చూపించాలి ప్రజల మీద కాదు

పథకం మార్చిన పరవాలేదు కేసీఆర్ కిట్, కంటి వెలుగు  అమలు చేయండి

హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

హుజురాబాద్, (విజయక్రాంతి): వివిధ ప్రాంతాల నుంచి చికిత్స కోసం నిత్యం వందలమంది ప్రభుత్వాసుపత్రికి వస్తుంటారని, వారి ఆరోగ్యం పట్ల ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించేదే లేదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం హుజురాబాద్ ప్రభుత్వాసుపత్రి ఆకస్మిక తనిఖి అనంతరం డాక్టర్లు సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గర్భిణీల పట్ల సోమవారం డాక్టర్లు డెలివరీ నిర్వహించకుండా ఆలస్యం చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. పేదల ఆరోగ్యం కోసమే ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ ఉంటుందని, ఒక్క రోగి కూడా ఆస్పత్రిలో ఇబ్బంది పడకూడదని అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వాసుపత్రిలో వైద్యం పూర్తిస్థాయిలో అందేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్థాయిలో చికిత్స అందడం లేదని అన్నారు.

ప్రభుత్వ తీరు చూస్తుంటే దున్నపోతుపై వర్షం పడినట్లుగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోపం ఉంటే కెసిఆర్, బీఆర్ఎస్ నాయకుల మీద తీర్చుకోవాలి తప్పా పేద ప్రజలపైన కాదన్నారు. హుజురాబాద్, జమ్మికుంట ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరతగా ఉందని వెంటనే పూర్తిస్థాయిలో సిబ్బందిని నింపాలన్నారు. గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్ తో పాటు డెలివరీ అయిన తర్వాత కెసిఆర్ కిట్ ని  కూడా అందించాలన్నారు. కెసిఆర్ కిట్ కి పేరును మార్చిన పరవాలేదని, గర్భిణీ స్త్రీలకు గతంలో మాదిరిగానే ఆడపిల్ల పుడితే 13000 మగ బిడ్డ పుడితే 12000 ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే కంటి వెలుగు కార్యక్రమాన్ని కూడా తిరిగి చేపట్టాలన్నారు. డాక్టర్లపై తమకు గౌరవం ఉందని ఆ గౌరవాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఈ తనిఖీల్లో ఎమ్మెల్యే వెంట అడిషనల్, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ చందూలాల్, ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారెడ్డి, ఆర్ ఏం ఓ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.