calender_icon.png 4 October, 2024 | 8:52 PM

ఫైనల్ బరిలో నీరజ్, అవినాశ్

13-09-2024 12:51:24 AM

బ్రస్సెల్స్ డైమండ్ లీగ్

బ్రస్సెల్స్: భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా బ్రస్సెల్స్ డైమండ్ లీగ్ ఫైనల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు. సెప్టెంబర్ 14న జరగనున్న జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. గత నెలలో లుసాన్నే డైమండ్ లీగ్‌లో బరిలోకి దిగిన నీరజ్ జావెలిన్‌ను రికార్డు స్థాయిలో 89.49 మీటర్ల దూరం విసిరి తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. అంతకముందు పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్‌ను 89.45 మీటర్లు విసిరి రజతం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈసారి బ్రస్సెల్స్ ఫైనల్ మీట్‌లో 90 మీటర్లే లక్ష్యంగా నీరజ్ బరిలోకి దిగుతున్నాడు. ఇక తొలిసారి డైమండ్ లీగ్ ఫైనల్ ఈవెంట్‌లో పాల్గొంటున్న భారత స్టీపుల్‌చేజ్ అథ్లెట్ అవినాశ్ సేబుల్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అవినాశ్ 14వ స్థానంలో నిలిచినప్పటికీ టాప్‌ఱ నలుగురు తప్పుకోవడంతో ఫైనల్ ఆడే అవకాశమొచ్చింది. 3వేల మీటర్ల స్టీపుల్ చేజ్‌లో జాతీయ రికార్డు హోల్డర్ అయిన అవినాశ్ నేడు జరగనున్న ఫైనల్లో మెరుస్తాడా లేదా అన్నది చూడాలి.