ముంబయి: రుణ భారంతో ఇబ్బంది పడుతున్న స్పైస్ జెట్కు సోమవారం మరోసారి ఎన్సీఎల్టీ నోటీసులు జారీ చేసింది. ఆ సంస్థ ఆపరేషనల్ క్రెడిటార్లలో ఒకటైన టెక్ జాకీ ఇన్ఫోటెక్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఎన్సీఎల్టీ ఈ నిర్ణయం తీసుకొంది. తాజా పిటిషన్ను మహేంద్ర ఖండే ల్వాలా, సంజీవ్ తంజాన్తోకూడిన బెంచ్ పరిశీలించింది. నోటీసులు జారీ చేసి.. నవంబర్ 14కు విచారణను వాయిదా వేసింది. తమ నుంచి స్పైస్ జెట్ సంస్థ రూ.1.2 కోట్ల విలువైన సాఫ్ట్వేర్ సేవలను వాడుకొందని టెక్ జాకీ సంస్థ సెక్షన్ 9 కింద దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది. ఆ బకాయిలకుగాను దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించాలని కోరింది.
ఈ ఏడాది జూన్లో ఐర్లాండ్ కేంద్రంగా పనిచేసే ఈఎల్ఎఫ్ సంస్థ దాఖ లు చేసిన పిటిషన్ ఆధారంగా స్పైస్ జెట్కు నోటీసులు జారీ చేశారు. ఈ సంస్థకు స్పైస్ జెట్ 12 మిలియన్ డాలర్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రపంచంలోనే ఇంజిన్ ఫైనా న్సింగ్లో ఇది అగ్రగామి.ఇదే కాక స్పైస్ జెట్ పలు రుణదాతలు దివాలా పరిష్కార పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
రూ.3,000 కోట్లు సమీకరణ
క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ఆధారంగా రూ.3,000 కోట్లు సమీకరించినట్లు స్పైస్ జెట్ సోమవారం వెల్లడించింది. దీనికి సంబంధించిన బిడ్స్ను సెప్టెంబర్ 16 న మొదలు పెట్టి 18న ముగించింది. ఈ క్యూఐపీ ఓవర్ సబ్స్ర్కైబ్ అయినట్లు వెల్లడించింది. ప్రముఖ ఇన్వెస్టర్ల నుంచి తమకు నిధులు సమకూరినట్లు తెలిపింది. ఈ మొత్తం కాకుండా గతంలోఫండింగ్ రౌండ్ నుంచి మరో రూ.736 కోట్లు వచ్చినట్లు పేర్కొంది.