ఎన్ఎంఓపీఎస్ సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ పిలుపు
హైదరాబాద్, జనవరి 26 (విజయక్రాంతి): జనవరి 24న కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన యూనిఫైడ్ పెన్షన్ విధానం నోటిఫికేషన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జనవరి 28న ఉద్యోగ ఉపాధ్యాయ కార్యాలయాల్లో యూపీఎస్ ప్రతులు దగ్ధం చేయాలని, వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేయాలని ఎన్ఓపీఎస్ సెక్రటరీ జనరల్ స్థిత ప్రజ్ఞ పిలుపునిచ్చారు.
కేరళలోని కోజికోడ్లో ఎన్ఎంఓపీఎస్ కేరళ స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభ, మహాధర్నాలో ఆయన ప్రసంగించారు. కేరళలో మొదలైన నిరసనలు, ఫిబ్రవరి 7న కర్ణాటక బెంగళూరు ఫ్రీడమ్ పార్క్లో యూపీఎస్ వద్దని ధర్నా చేపడుతున్నామని తెలిపారు. మార్చి 2న హైదరాబాద్లో ఛలో ధర్నా చౌక్ పేరిట నిరసన కార్యక్రమాలు ఉంటాయన్నారు.
ఉద్యోగ, ఉపాధ్యాయులు భారీగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇప్పటికే రెండు దశాబ్దాలుగా సీపీఎస్ ఉద్యోగులను గందరగోళపరిచిన కేంద్రం ఇప్పుడు యూపీఎస్ను తెరపైకి తెచ్చి ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తుందన్నారు. కేరళ సీపీఎస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ రఫీక్, ప్రధాన కార్యదర్శి షాజీవ్ తదితరులు పాల్గొన్నారు.