28-02-2025 06:31:39 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో శుక్రవారం జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. భారత శాస్త్రవేత్త డాక్టర్ సీవీ రామన్ ఘనతను స్మరించుకుంటూ విద్యార్థులకు శాస్త్రానికి సంబంధించిన అవగాహన పెంచే ఉద్దేశ్యంతో ఉపాధ్యాయులు సైన్స్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శాస్త్రీయ ప్రదర్శనలను ప్రదర్శించడంతో పాటు ప్రయోగాలు చేసి తమ ప్రతిభను చాటారు.
ముఖ్య అతిథిగా హాజరైన స్కూల్ డైరెక్టర్ రవి ప్రసాద్ మాట్లాడుతూ... శాస్త్ర విజ్ఞానం మన అభివృద్ధికి మార్గదర్శిగా నిలుస్తుందన్నారు. విద్యార్థులు కొత్త ఆవిష్కరణలను సాధించాలని, పరిశోధనా తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఈ వేడుకల్లో స్కూల్ ప్రిన్సిపాల్ ఎం.రాజారమేష్, సైన్స్ ఉపాధ్యాయులు వెంకటరెడ్డి, కె.అపర్ణ, కె.ఆలేఖ్య, డి.సాయి సంజన, పి.శ్రావణి, వి.అపర్ణలతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం భౌతిక శాస్త్రంలోని విభిన్న అంశాలపై నిర్వహించిన క్విజ్ పోటీలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. విజేతలకు బహుమతులు అందజేశారు.