05-03-2025 12:29:20 AM
సీనియర్ సివిల్ జడ్జి జితేందర్
మెదక్, మార్చి 4(విజయక్రాంతి): జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలమేరకు ఈనెల 8న మెదక్ జిల్లాలోని అన్ని న్యాయస్థానాలలో లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ తెలిపారు. మంగళవారం మెదక్ కోర్టు ఆవరణ నుండి సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ ఈనెల 8న జరుగు లోక్ అదాలత్ పై ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీమార్గమే రాచమార్గము అనే సదుద్దేశ్యంతో కక్షిదారులకు త్వరితంగా, సమ్మతమైన న్యాయం సులువుగా అందుబాటులో ఉండాలని దేశవ్యాప్తంగా ఈనెల 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గౌరవ చైర్ పర్సన్ ఆదేశాలమేరకు కక్షిదారుల సౌకర్యార్థం ఈనెల 1వ తేదీ నుంచే లోక్ అదాలత్ బెంచీలను ఆయా న్యాయస్థానాలలోనే ఏర్పాటు చేశామని చెప్పారు.
వివాహ సంబంధ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, భూమి తగాదాలు, డబ్బు తగాదాలు, ప్రమాదాల పరిహారం కేసులు, చిన్నచిన్న క్రిమినల్ కేసులు ఇలా వివిధ రకాల కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఒక సదవకాశం అన్నారు. అంతేకాకుండా కోర్టులో కేసువేసే అర్హత కలిగిన సమస్య ఏదైనా కేసు వేయకుండా ప్రిలిటిగేషన్ సెటిల్మెంట్ ద్వారా ఈ లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చని తెలిపారు.
పేదరికరంతో ఉన్నటువంటి వారు, న్యాయ సహాయం కావాల్సిన వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను నేరుగా సంప్రదించాలని తెలిపారు. కక్షిదారులు న్యాయస్థానానికి కట్టిన కోర్టు ఫీజు తిరిగి పొందవచ్చని వివరించారు. జాతీయ లోక్ అదాలత్ ని విజయవంతం చేయాలని, ప్రజలందరూ ఒక సామరస్య వాతావరణంలో ప్రశాంతంగా జీవించాలని ఆయన కోరారు.