23-02-2025 06:25:48 PM
ముషీరాబాద్ (విజయక్రాంతి): వెంట్రిలాక్విజంలో అందిస్తున్న సేవలకు ఎర్లీ చైల్డ్ హుడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈనెల 15న ముంబైలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎర్లీ చైల్డ్ హుడ్ కాన్ఫరెన్స్లో జాతీయ స్థాయి అవార్డును అందుకున్నట్లు ఇంటర్నేషనల్ వెంట్రిలాక్విజం ఆర్టిస్ట్, టెడ్ఎక్స్ స్పీకర్, వాయిస్ కోచ్ ఎం.సంతోష్ కుమార్ పేర్కొన్నారు. తాను గత 2012 నుండి యూఎస్ఏలో జరిగే అంతర్జాతీయ వెంట్రిలోక్విజం సదస్సుకు హాజరైన ఏకైక వెంట్రిలాక్విజం కళాకారుడినని తెలిపారు.
ఈ మేరకు ఆదివారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఆంజనేయులుతో కలిసి మాట్లాడుతూ.. బొమ్మలతోటి ప్రదర్శన, టీవీ, సెల్ ఫోన్, నోట్లో వేలు పెట్టుకోవడం, పర్యావరణ పరిరక్షణ, జంక్ ఫుడ్స్ నివారణ తదితర వాటిపై విద్యార్థులకు అవగాహన పెంపొందిస్తున్నామని, వాటి కృషికి అవార్డు లభించిందని చెప్పారు. 200 పాఠశాలల్లో 1000 పైగా ప్రదర్శనలు ఇచ్చామని తెలిపారు.
ఇండియా, యూఎస్ఏ, యూఏఈ, యూకే, జర్మనీ అంతటా వెంట్రిలోక్విజం ప్రదర్శనలు ఇస్తున్నట్లు వెల్లడించారు. తాను దివంగత పద్మశ్రీ డాక్టర్ నేరేల వేణు మాధవ్ మార్గదర్శకత్వంలో తెలుగు విశ్వవిద్యాలయంలో మిమిక్రీలో డిప్లొమా చేశానని, ప్రముఖ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ జి.వి.ఎన్. రాజు తనకు మార్గదర్శకులు అని పేర్కొన్నారు.