calender_icon.png 19 October, 2024 | 3:50 AM

గుండాలను కట్టడి చేస్తున్నందుకే నా ఇంటిపై దాడి

19-10-2024 01:04:51 AM

ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు

మంచిర్యాల, అక్టోబర్ 18 (విజయక్రాంతి): జిల్లాలో రౌడీయిజాన్ని, గుండాయిజాన్ని కట్టడి చేస్తున్నందుకే తన ఇంటిపై కొందరు దుండగులు దాడి చేశారని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ నెల 14న రాత్రి ముసుగులు ధరించిన ముగ్గురు దుండగులు తన ఇంటిపై దాడి చేసి వాచ్‌మెన్‌పై భౌతిక దాడి చేశారని, అయినంత మాత్రాన ఎవరికీ భయపడేది లేదన్నారు. మంచిర్యాలలో గంజాయి, గుండాయిజాన్ని నిర్మూలించడానికి తాను ప్రయత్నం చేస్తుండటం అక్రమార్కులకు గిట్టడం లేదని ఆరోపించారు.

గతంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, ఆయన తనయుడు విజిత్ రావు అండతో చెలరేగిపోయిన వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారని తెలిపారు. సమావేశంలో మంచిర్యాల, నస్పూరు మున్సిపల్ చైర్మన్లు రావుల ఉప్పలయ్య, వేణు,  నాయకులు తదితరులు పాల్గొన్నారు.