15-04-2025 12:05:08 AM
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్జాతర’. శ్రీలీల కథానాయికగా కాగా, ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్.. రవితేజకు తాతగా కనిపించనున్నారు. భాను భోగవరపు దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు.
తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి మొదటి గీతంగా ‘తూ మేరా లవర్’ను విడుదల చేశారు. ‘తూ మేరా లవ్వరు లవ్వరూ లవ్వరూ.. మై తుజ్ కో దియా ఫ్లవ్వరూ.. తూ మేరా లవ్వరు లవ్వరూ లవ్వరూ.. పెట్టావే చెవిలో క్యాలిఫ్లవ్వరూ..’ అంటే సాగుతోందీ పాట. భీమ్స్ సిసిరోలియో ఈ పాటను స్వరపరిచారు. భాస్కరభట్ల సాహిత్యం ఆకట్టుకుంటున్నాయి.
ఇది రవితేజ బ్లాక్బస్టర్ చిత్రం ‘ఇడియట్’లోని ఐకానిక్ చార్ట్బస్టర్ ‘చూపుల్తో గుచ్చిగుచ్చి చంపకే’ పాటకు ట్రిబ్యూట్గా మలిచిన గీతం కావడం విశేషం. ఈ పాటను దివంగత సంగీత దర్శకుడు చక్రికి ప్రత్యేక సంగీత నివాళిగా మార్చడానికి కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించి ఆయన స్వరాన్ని తిరిగి సృష్టించారు. ఈ చిత్రానికి డీవోపీ: విధు అయ్యన్న; మాటలు: నందు సవిరిగాన; ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగాల; ఎడిటర్: నవీన్ నూలి.