08-02-2025 01:45:25 AM
నల్లగొండ, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): నల్లగొండ టూటౌన్ పరిధిలోని రెహమత్నగర్కు చెందిన గడ్డం పుష్పలతకు చెందిన పెంపుడు పిల్లి ఏడాది క్రితం తప్పిపోయింది. శుక్రవారం అదే పోలికలతో ఉన్న పిల్లి పక్కింట్లో కనిపించింది. దీంతో ఆ పిల్లి తనదేనని, పక్కింటి వ్యక్తి అపహరించి గోధుమ రంగు వేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పక్కింటి వ్యక్తి సైతం పిల్లి తనదేనని ఇంకా తన వద్ద ఇలాంటివి ఐదు పిల్లులున్నాయని వారించాడు. దీంతో పంచాయితీ ఎటూ తేల్చలేక ఓ దశలో పోలీసులు తలలు పట్టుకున్నారు.
చివరకు పిల్లి స్వాధీనం చేసుకొని రంగు నిర్ధారణకు వెంట్రుకలను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపారు. నివేదిక ఆధారంగా సిసలైన యజమానిని గుర్తించి అప్పగిస్తామని ఎస్సై నాగారాజు తెలిపారు. పెంపుడు పిల్లి కోసం ఇద్దరు పోలీసు కేసు వరకు వెళ్లడం.. పోలీసులు పిల్లిని ఫోరెన్సిక్ పరీక్షకు పంపడం.. నివేదికలో ఏం వస్తుంది? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.