సాంప్రదాయ బద్ధంగా ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటి
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం నియోజవర్గం పరిధిలోని దుమ్ముగూడెం గ్రామంలో జరుగుతున్న ముత్యాలమ్మ అమ్మవారి జాతరకు తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, భద్రాచలం మాజీ శాసనసభ్యులు పొదెం వీరయ్య మంగళవారం హాజరయ్యారు. మేళ తాళాలు, భాజా భజంత్రీలతో జాతర నిర్వాహకులు పొదెం వీరయ్యకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 'పొదెం' ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, భద్రాచలం నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో విరాజిల్లాలని ఈ సందర్భంగా అమ్మవారిని వేడుకున్నట్లు 'పొదెం' వెల్లడించారు. రెండేళ్లకు ఒకసారి నిర్వహించే ముత్యాలమ్మ జాతర విజయవంతంగా జరపటం పట్ల జాతర నిర్వాహకులను గ్రామస్తులను 'పొదెం' ఈ సందర్భంగా అభినందించారు.