01-04-2025 02:17:15 AM
మరణించిన జీవాలను కోసి రోజుల తరబడి ఫ్రిజ్లో దాచి
ఉగాది, రంజాన్ వేళల్లో మటన్ ప్రియులకు అంటగట్టి
- ముక్క ఆశతో పట్టించుకోని మున్సిపల్ శాఖ అధికారులు
నాగర్ కర్నూల్ మార్చి 31 (విజయక్రాంతి)నాగర్ కర్నూల్ జిల్లాలో మటన్ దుకాణదారులు సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మృతి చెందిన మూగజీవాలను వదించి రోజుల తరబడి ఫ్రిజ్లోనే దాచిన మాంసాన్ని ఆదివారాలు, పండుగ దినాల్లో సామాన్యులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. పశు వైద్యాధికారులు నిర్ధారించి స్టీల్ వేసిన మాంసాన్నే అమ్మాల్సి ఉంది. కానీ ముక్క ఆశతో మటన్ దుకాణాల్లో ఉచితంగా మటన్ తీసుకు వెళుతున్న అధికారులు వారిపై చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.
కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలతోపాటు ఆయా గ్రామపంచాయతీలలో స్లాటర్ హౌస్ (జంతు వదశాలలు) ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ వ్యాధులతో బాధపడుతున్న మేకలు గొర్రెలు మృతి చెందిన వాటిని కూడా వదిస్తూ రోజుల తరబడి ఫ్రిజ్లో దాచి ఉంచి ఆదివారం, పండుగ దినాల్లో మాంసపు ప్రియులకు అంటగడుతున్న పరిస్థితి నెలకొంది. సోమవారం ఉగాది కనుమ పండుగతో పాటు రంజాన్ కూడా ఒకే రోజు ఉండడంతో పెద్ద ఎత్తున మటన్ ప్రియులు మటన్ దుకాణాలకు బారులు తీరారు. దీంతో సందట్లో సడే మియా అనే విధంగా ఆరోగ్యవంతమైన మటన్ చూపిస్తూ సుమారు పది రోజుల క్రితం వధించిన వాటిని కూడా ఫ్రిజ్లో దాచి అంటగట్టి నట్లు మాంసప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .
ఒకరోజుకు ముందే సుమారు వందల సంఖ్యలో వధించిన మేకలు, గొర్రెలు తలకాయలు కాళ్లను కాలుస్తూ కనిపించారు. మేక, గొర్రెను కోసిన గంటల్లోనే వాటిని విక్రయించాల్సి ఉన్నా ఒక రోజుకు ముందే తలకాయలు కూడా కాల్చడంతో మటన్ పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంలోనే ఉంటుందని అలాంటి మటన్ అంతగాట్టి నట్లు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు అయినా స్పందించి అపరిశుభ్రమైన మటన్ విక్రయాలపై చర్యలు తీసుకోవాలని మాంసప్రీలు కోరుతున్నారు.