12-02-2025 12:39:05 AM
ఖమ్మం, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి) :- న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ముదిగొండ హత్య కేసు బాధిత కుటుంబ సభ్యులు, ముత్తారం గ్రామస్థులు ధర్నా చేసి, కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ధర్నాను పోలీసులు అడ్డుకున్నప్పటికీ ధర్నా నిర్వహించారు.
ముత్తారం గ్రామానికి చెందిన గోళ్లమూడి కేశవ్ పోయిన క్రిస్మస్ రోజున అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే కేశవ్ ఒక అమ్మాయిని ప్రేమించాడని, ఆ నేపథ్యంలోనే కేశవ్ ను అమ్మాయి తరపు వారే హత్య చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
కేసు గురించి అడిగితే దాని సంగతి మర్చిపోండని అంటున్నారని వినతి పత్రంలో తెలిపారు. తమ కు న్యాయం చేసి ఆదుకోవాలని కోరుతూ ఆందోళన చేశారు. ఈ ధర్నా లో మృతుడి కుటుంబ సభ్యులు గోళ్లమూడి స్వప్న, గోళ్లమూడి మరియమ్మ, వారి కుటుంబ సభ్యులు,ముత్తారం గ్రామస్తులు పాల్గొన్నారు.