25-04-2025 06:25:59 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ముస్లింలు శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం నమాజ్ సమయంలో మసీదుల్లో పహల్గామ్ ఘటనలో మరణించిన వారి ఆత్మ శాంతి కోసం ప్రార్థించారు. ప్రజాస్వామ్య భారతదేశంలో హింస వాదానికి తావు లేదని, ఉగ్ర మూకల చర్యలను ప్రతి ఒక్కరు ఖండించాలని పిలుపునిచ్చారు. ఉగ్ర చర్యలకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పలుచోట్ల శుక్రవారం నమాజ్ తర్వాత ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు.