13-03-2025 01:54:03 AM
హత్య కేసును ఛేదించిన పోలీసులు
పాల్వంచ, మార్చి 12 (విజయక్రాంతి): వివాహేతర సంబంధానికి అడ్డుగా నిలిచిన భర్తను ప్రియుడుతో కలిసి పథకం ప్రకారమే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేటతెల్లమైంది. హత్య కేసును చేదించిన పాల్వంచ డీఎస్పీ సతీష్ బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని పేట చెరువు గ్రామానికి చెందిన పుట్టల నరేష్ (33 ) అనే వ్యక్తి గత నెల 11వ తేదీన మద్యం తాగి మృతి చెందాడు. కొడుకు మరణం పై అనుమానం కలిగిన తల్లి పుట్టల చుక్కమ్మ అదే నెల 17వ తేదీన పాల్వంచ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదును స్వీకరించిన పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పేట చెరువు గ్రామంలోని స్మశానంలో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీసి పంచనామా, పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కేసు దర్యాప్తు చేస్తుండగా లభించిన శాస్త్రీయ ఆధారాల ఆధారంగా పుట్టల నరేష్ ది సహజ మరణం కాదని, హత్యగా తేలింధన్నారు. మృతుడి భార్య పుట్టల రజితకు, గద్దల సాంబశివ రావుకు అక్రమ సంబంధం ఉన్నదన్న విషయం భర్త పుట్టల నరేష్ కు తెలియడంతో పలుమార్లు గొడవలు జరిగాయి.
భార్యను మందలించడంతో పాటు భార్యను అక్రమ సంబంధం ఉందని ఇబ్బంది పెడుతుండని, గద్దల సాంబశివరావు, మృతుడి భార్య రజిత ఇద్దరు కలిసి పుట్టల నరేష్ అడ్డు తొలగించుకోవాలని ఓ పథకం ప్రకారం గత నెల పదవ తారీఖున నరేష్ సారపాక లో తన బంధువుల ఇంటికి ఫంక్షన్ కి వెళ్లగా, గద్దల సాంబశివరావు,అతని స్నేహితుడు తాటి నరేష్ సాయంతో ముందస్తు పథకం ప్రకారం నరేష్ కు మద్యం బాటిల్లో పురుగుల మందు కలిపి ఇవ్వటం, ఆ మద్యం తాగి మృతుడు నరేష్ తన సొంత గ్రామం పేట చెరువు ఇంటికి వచ్చి అస్థత్వకు గురై, 11వ తేదీన మరణించడం జరిగిందన్నారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసును విచారించగా నరేష్ హత్యకు గురైనట్లు, అందుకు పాత్రధారులైన గద్దల సాంబశివరావు, తాటి నరేష్ పుట్టల రజితపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు డి.ఎస్.పి వివరించారు . ఈ సమావేశంలో సీఐ సతీష్ ఎస్ఐ సుమన్, ఏ ఎస్ ఐ కస్తూరి, కానిస్టేబుల్ పాల్గొన్నారు.