calender_icon.png 22 September, 2024 | 4:49 AM

కొట్టి, విషం తాగించి విద్యార్థి హత్య?

22-09-2024 02:49:47 AM

కుటుంబ సభ్యులు, ఏబీవీపీ నేతల ఆందోళన

ఆదిలాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): ఎస్టీ హాస్టల్‌లో అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతిచెందడం ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపింది. నార్నూర్ మండలం చోర్‌గావ్‌కు చెందిన రాథోడ్ జితేందర్(18) ఆదిలాబాద్‌లోని ఎస్టీ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. అయితే శుక్రవారం రాత్రి నలుగురు వ్యక్తులు రాథోడ్ జితేందర్‌ను తీవ్రంగా కొట్టి, విషం తాగించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. జితేందర్‌ను ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.

దీంతో విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు, ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు ఆసుపత్రికి తరలివచ్చారు. తమ కుమారుడిని కొట్టి, విషం ఇచ్చి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్‌లోని బస్టాండ్ ఎదుట రహదారిపై గంటల తరబడి రాస్తారోకో చేయడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆర్డీవో వినోద్‌కుమార్, డీఎస్పీ జీవన్‌రెడ్డి ఘటన స్థలానికి వచ్చి నచ్చజెప్పినా ఆందోళన విరమించలేదు.