24-03-2025 12:43:12 AM
ఎల్బీనగర్ పీఎస్ పరిధిలోని శివగంగ కాలనీలో దారుణం
ఎల్బీనగర్, మార్చి 23 : ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివ గంగ కాలనీలో శనివారం రాత్రి ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. భరత్ నగర్ కి చెందిన బొడ్డు మహేశ్ (31) అనే వ్యక్తిని అర్ధరాత్రి గొడ్డళ్లతో వేటాడి చంపిన దుండగులు.
అయితే, కొన్ని రోజుల క్రితం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ క్లినిక్ లో ఇద్దరు వ్యక్తులపై కత్తితో దాడి చేసిన కేసులో బొడ్డు మహేశ్ ఇటీవల బెయిల్ పై వచ్చాడు. శనివారం రాత్రి శివగంగ కాలనీ, శివాలయం రోడ్డులో బైక్ పై మహేశ్ వస్తుండగా పగిళ్ల పురుషోత్తం, నాగార్జున, సందీప్, రాముతోపాటు మరికొందరు శివగంగ కాలనీ, శివాలయం రోడ్డులో మహేశ్ పై దాడి చేశారు.
మొదట కారుతో గుద్ది, ఆ తర్వాత కత్తులు , గొడ్డళ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో మహేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న ఎల్బీనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొన ప్రాణంతో ఉన్న మహేశ్ ను వెంటనే స్థానికంగా ఉన్న కామినేని దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ మహేశ్ మృతి చెందాడు. పాతకక్షల నేపథ్యంలో హత్య జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుల కోసం ప్రత్యేక పోలీస్ బృందాలతో గాలిస్తున్నారు.