- ఎఫ్ఎల్ఓ చైర్ పర్సన్ ప్రియా గజ్దర్ వెల్లడి
హైదరాబాద్, జూలై 12(విజయక్రాంతి): ఎఫ్ఎల్ఓ స్టుల్ తత్వా ఆధ్వర్యంలో మహిళా సాధికారత, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహకమే లక్ష్యంగా ఈ నెల 20. 21 తేదీల్లో ఎక్స్పో జరగనుంది. ప్రముఖ యాంకర్ సుమ ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఎఫ్ఎల్ఓ చైర్పర్సన్ ప్రియా గజ్దర్ తెలిపారు. శుక్రవారం ఓ ప్రైవేట్ హోటల్లో మాట్లాడుతూ.. భారీ ఎత్తున ఈ ఎక్స్పోను నిర్వహిస్తున్నామని, ఇందులో 212 స్టాల్స్ను ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
15 రాష్ట్రాల నుంచి 200లకు పైగా ఎంఎస్ఎంఈలు ఇందులో భాగస్వామ్యమైనట్లు వెల్లడించారు. రెండు రోజుల్లో కలిపి మొత్తం 10 వేల మంది స్టాల్స్ను సందర్శిస్తారని అంచనా వేసినట్లు తెలిపారు. ఈ ఎక్స్ పోలో 75 శాతం మంది కొత్త వారు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని, పోచంపల్లి, చేర్యాల, నారాయణపేట, పుట్టపాక, సిద్ధిపేటకు చెందిన చీరెలు, అల్లికలతో పాటు చేతితో తయారు చేసిన వస్తువులను ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు.