15-04-2025 12:00:00 AM
అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పనిచేస్తుంది
రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి
అంబేద్కర్ అందరివాడు.. కొందరివాడుకాదు: మాజీఎం బూర నర్సయ్యగౌడ్
అబ్దుల్లాపూర్మెట్, ఏప్రిల్14: దేశంలోగానీ.. రాష్ట్రంలోగానీ డాక్టర్ బీఆర్ అంబే ద్కర్ ఆశయాలకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి అన్నారు. సోమవారం పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధి తట్టి అన్నారం అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు నల్ల ప్రభాకర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకలు ముఖ్య అతిథులుగా హాజరైన మల్రెడ్డి రాం రెడ్డి మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. రాహుల్ గాంధీ ఆదేశాలకు మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కులగణన చేసిందన్నారు. అదే విధంగా తెలంగాణలో ఏబీసీడీ వర్గీకరణ చేశామన్నారు.
అంబేద్కర్ అందరివాడు..
భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మేథావి అని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నాడు. రాజ్యాంగం ఒక వర్గానికో.. ఒక్క మతానికో.. అంబేద్కర్ పరిమితం కాదన్నారు. అంబేద్కర్ కొందరివాడు కాదు.. అందరివాడు... ఆయన అందించిన స్ఫూర్తి ప్రతి ఒక్కరం ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మద్ది శ్రీధర్రెడ్డి, సాదుల శ్రీనివాస్, భాస్కర్, నాయకులు దేవిడి వేణుగోపాల్రెడ్డి, ఢిల్లీ మాధవరెడ్డి, రావుల గోపాల్, సీపీఎం నాయకులు ఏర్పుల నర్సింహా, నాగోల్ ఇన్స్పెక్టర్ సూర్యనాయక్, సబ్ ఇన్స్పెక్టర్ రమేశ్, యువజన నాయకులు నల్ల శివకుమార్, సుక్క రవి, నగేశ్, నల్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.