calender_icon.png 19 October, 2024 | 4:43 AM

మూసీ లూటిఫికేషన్

19-10-2024 02:12:15 AM

  1. ఢిల్లీ కాంగ్రెస్‌కు ఏటీఎంలా మూసీ ప్రాజెక్టు 
    1. డబ్బు సంచులు పంపేందుకే లక్షన్నర కోట్ల బడ్జెట్
    2. ఆరు గ్యారెంటీలకు లేని నిధులు మూసీకెలా వస్తాయి? 
    3. మేం 25వేల కోట్లతో మూసీ ప్రాజెక్టు సిద్ధం చేశాం
    4. ఇప్పడు లక్షన్నర కోట్ల్లు ఎవరి లాభం కోసం? 
    5. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్న 

హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయ క్రాంతి): మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు ఏటీఎంగా మారిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు విమర్శించారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు డబ్బు మూటలు పంపేందుకే సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రాజెక్టు చేపడుతు న్నారని ఆరోపించారు.

అది మూసీ బ్యూటి ఫికేషన్ కాదని, కాంగ్రెస్ నాయకుల లూటిఫి కేషన్ అని నిప్పులు చెరిగారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి గురు వారం తెలిపిన వివరాలకు కౌంటర్‌గా శుక్ర వారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయడానికి నిధులు లేవని చెప్తున్న రేవంత్.. మూసీ సుందరీకరణకు లక్షన్నర కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. ఎవరి లాభం కోసం ఈ ప్రాజెక్టు చేపడు తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పా లని డిమాండ్ చేశారు. 

డిజైన్లు మళ్లీ ఎందుకు?

బీఆర్‌ఎస్ పాలనలోనే మూసీ డిజైన్లు తయారు చేశారని, ఇప్పడు మెగహార్ట్ సంస్థ కు రూ.142 కోట్లు ఇచ్చి మళ్లీ డిజైన్లు ఎం దుకు తయారు చేయిస్తున్నారని కేటీఆర్ నిలదీశారు. ‘ఆయన (రేవంత్)కు వడ్డించిన విస్తరిలా అంతా సిద్ధం చేసి పెట్టాం. మా హయాంలోనే మూసీకి సంబంధించిన అన్ని పనులు ప్రారంభించాం. ప్రభుత్వం కొత్తగా చేపట్టాల్సినవి ఏమీ లేవు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మూసీ పరీ వాహక ప్రాంతంలో ఇప్పటివరకు ఎలాంటి సర్వే జరగలేదు. జేసీబీలతో, రోజువారీ కూలీలతో ఇళ్లు కూల్చడం తప్ప ఏమీ లేదు. ప్రాజెక్టు అంచనాలు రూ.50 వేల కోట్ల నుంచి రూ.లక్షన్నర కోట్లు వరకు పెంచారు. అన్నీ అబద్ధాలు, అర్థ సత్యాలే. రోజుకో మాట మాట్లాడుతూ తప్పులు కప్పిపుచ్చు కునేందుకు సీఎం నాటకాలాడుతున్నారు.

నోట్ల రద్దు ఎందుకు చేశారో విపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నాడు ప్రధాని మోదీ రోజుకో తీరుగా మాట్లాడారు. ఆయన బాటలోనే నేటి తెలంగాణ పాలకులు నడుస్తున్నారు. 1908లో అతిపెద్ద వరద ముప్పు వచ్చి 15 వేల మంది చనిపోవటంతో నాటి నిజాం పాలకుడు ప్రముఖ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సలహా కోరగా నగరానికి రక్షణ కవచంలా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నిర్మించాలని ఆయన సూచించారు.

ఆ తరువాత మూసీ విషయంలో ఏ ప్రభుత్వం కూడా అంత గొప్పగా పనిచేయలేదు. మూసీ నది మురికి కూపంగా మారడానికి గత కాంగ్రెస్, టీడీపీ పాలకులే కారకులు. అందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం కారణమని సీఎం రేవంత్ పేర్కొనడం ఆయన అజ్ఞానానికి ఇంతకన్న నిదర్శనం మరొకటి లేదు. తప్పులు చేసి దొరికిపోవడంలో ఆయనకు మించినోడు లేడు.

మూసీ విషయంలో అనాలోచిత, అసంబద్ధ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మూసీ సుందరీకరణకు రూ.లక్షన్న కోట్లు ఖర్చు చేస్తామని గోపన్‌పల్లి సభలో చెప్పారు. గజినీ మాదిరిగా మాట మార్చడం వెనక ఆంతర్యమేంటి? ఒకవైపు మూసీ సుందరీకరణ అంటూ.. మరోవైపు వికారాబాద్ అడవుల్లో ఆ నదికి ఉరి వేసేలా రాడార్ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. బీఆర్‌ఎస్ పాలనలో కేంద్రం పలుమార్లు ఈ ప్రాజెక్టు చేపట్టాలని కోరినా మేము తిరస్కరించాం’ అని కేటీఆర్ అన్నారు. 

మా ప్రణాళిక రూ.౨౫ వేల కోట్లతోనే..

తాము అధికారంలో ఉన్నప్పుడు మూసీ నదిపై 15 వంతెనలు, చెక్ డ్యామ్‌లు నిర్మించి పర్యాటకాన్ని కూడా అభివృద్ధి చేయాలని ప్రణాళిక తయారుచేశామని, అందుకు మొత్తం రూ.25 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలు వేసి కొన్ని పనులు కూడా ప్రారంభించినట్లు కేటీఆర్ తెలిపారు.

వందశాతం మురుగునీటి శుద్ధికి రూ.3,860 కోట్లతో 31 ఎస్టీపీల నిర్మాణం ప్రారంభించామని, అందులో రెండు పూర్తిచేసి ప్రారంభించామని చెప్పారు. మిగతావి తమ ప్రభుత్వ హయాంలోనే 90 శాతం పూర్తిగా కాగా ప్రస్తుతం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

మూసీపై పడమర నుంచి తూర్పువరకు ఎక్స్‌ప్రెస్ వే కోసం రూ.10 వేల కోట్లు, 15 బ్రిడ్జిల కోసం రూ.500 కోట్లు, గండిపేట నీళ్లకు గోదావరి నీళ్లు కలిపేందుకు రూ. 1100 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ వంతెనల కోసం ప్రపంచ స్థాయి 9 కంపెనీలతో డిజైన్‌లు కూడా వేయించినట్లు వివరించారు. నాగోల్ నుంచి 5 కిలోమీటర్లు మూసీకి ఇరువైపులా రోడ్లు, పార్కులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

పేదలకు నష్ట పరిహారం, ఇళ్లు కోల్పోయన వారికి ఇళ్ల నిర్మాణానికి.. ఇలా అంతా కలిపి రూ.25 వేలు కోట్లు అవసరమవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. మరిప్పుడు ఈ ప్రాజెక్టుకు రూ.1.5 లక్షల కోట్లు ఎందుకు అని నిలదీశారు. రివర్ బెడ్‌లో 11 వేల నిర్మాణాలు ఉండగా, వాటిని తొలగిస్తే లక్షల మంది నిరాశ్రయులు అవుతారని కేసీఆర్‌కు చెప్పడంతో ఇళ్లు కూల్చే పనులు వద్దని ఆయన చెప్పారని, దాంతో నాడు పేదల జోలికి వెళ్లలేదని చెప్పారు. 

పేదలను నిరాశ్రయులను చేస్తే పోరు తప్పదు

నగరంలో మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లు కూల్చివేస్తే సహించేదిలేదని కేటీఆర్ హెచ్చరించారు. బాధితులకు అండగా ఉంటామని తేల్చి చెప్పారు. హైడ్రా పేరుతో వందలా ది ఇళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం నేలమట్టం చేస్తుం టే బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు మౌనంగా ఉన్నారని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు ఒకటై ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని మండిప డ్డారు. బాధితుల పక్షాన బీఆర్‌ఎస్ అలుపెరగని పోరాటం చేస్తుందని, పేదల నివాసాల వద్ద వెళ్లవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.