- హైదరాబాద్లో తొలిసారి రూ. 80,000 దాటిన తులం పసిడి
- రూ.1.12 లక్షలకు కేజీ వెండి
హైదరాబాద్, అక్టోబర్ 23: ధనతెరాస్, దీపావళి దగ్గరకొస్తున్న కొద్దీ వెండి బంగా రాలు కొండెక్కుతున్నాయి. ప్రపంచ ప్రధాన కేంద్ర బ్యాంక్ల వడ్డీ రేట్ల కోతలు కొనసాగుతాయన్న అంచనాలతో పాటు, మధ్యప్రాచ్య యుద్ధ ఉద్రిక్తతలు, రానున్న యూఎస్ అధ్యక్ష ఎన్నికల పట్ల అనిశ్చితి బంగారాన్ని పరుగులు తీయిస్తున్నాయి.
బంగారానికి తోడుగా వెండి తళతళా మెరుస్తున్నది. తాజాగా అటు అంతర్జాతీయ మార్కెట్లోనూ, ఇటు దేశీయంగానూ సరికొత్త రికార్డు స్థాయికి పుత్తడి పెరిగింది. బుధవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర తొలిసారిగా రూ. 80,000 శిఖరాన్ని చేరింది. తాజాగా రూ. 430 పెరిగి రూ.80,070 వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది.
ఇప్పటికే ఢిల్లీ బులియన మార్కెట్లో ఇది రూ.81,000 స్థాయిని దాటేసి రూ. 81,500 రికార్డు గరిష్ఠ స్థాయికి ఎగిసింది. ప్రపంచ మార్కెట్లో ఔన్సు బం గారం ఫ్యూచర్స్ ధర చరిత్రలో తొలిసారిగా బుధవారం ఉదయం మరింత పెరిగి 2,772 డాలర్ల రికార్డు గరిష్ఠానికి చేరింది. దీనితో దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్లో (ఎంసీఎక్స్) 10 గ్రాముల పుత్తడి ధర 78,800 స్థాయిని తాకింది.
ప్రపంచ మార్కెట్లో ఇన్వెస్టర్ల డిమాండ్కు తోడు స్థానిక మార్కెట్లో రాను న్న ధనతెరాస్, దీపావళి నేపథ్యంలో కొనుగోళ్లు పెరుగుతాయన్న అంచనాలు పుత్తడి జొరుకు కారణమని బులియన్ ట్రేడర్లు తెలిపారు. తాజాగా హైదరాబాద్లో 22 క్యారట్ల ఆభరణాల బంగారం తులం ధర మరో రూ.400 పెరిగి రూ.73,400 వద్దకు చేరుకున్నది.
వెండి వెలుగులు
బంగారం బాటలోనే వెండి సైతం వెలుగులు విరజిమ్ముతున్నది. బుధవారం హైదరాబాద్లో కేజీ వెండి ధర మరొ రూ.2000 పెరిగి చరిత్రలో తొలిసారిగా రూ.1,12,000కు చేరింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళికరాజకీయ ఉద్రిక్తతలు, దేశీయంగా సీజనల్ డిమాండ్తో వెండి ధరలు పరుగుపెడుతున్నాయని ఎస్కేఐ క్యాపిటల్ నరీందర్ వాధ్వా చెప్పారు.
పారిశ్రామిక డిమాండ్, బంగారం ర్యాలీ కారణంగా వెండి కూడా పెరుగుతున్నదని కమోడిటీ మార్కెట్ నిపుణులు వివరించారు. స్థానిక మార్కెట్లో గత నాలుగు రోజుల్లోనే వెండి ధర రూ. 5,000 మేర పెరిగింది. ప్రపంచ మార్కెట్లో ఔన్సు వెండి ధర 35 డాలర్ల స్థాయిని అధిగమించింది.