18-02-2025 12:10:17 AM
రాజేంద్రనగర్, ఫిబ్రవరి 17: హైదరాబాదులోని భారతీయ వరి పరిశోధనా సంస్థ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మధ్య సోమవారం అవగాహన ఒప్పందం కుదిరింది. రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో జరిగిన కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ జి ఈ సి హెచ్ విద్యాసాగర్, భారతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఐ ఆర్) సంచాలకులు డాక్టర్ ఆర్.
మీనాక్షి సుందరం పిజెటి ఏయు ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య సమక్షంలో అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ జానయ్య మాట్లాడుతూ.. వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయ పరిశోధనలు ప్రాధాన్యతా పద్ధతిలో చేపట్టాలని, వరిలో ఉత్పత్తి, ఉత్పాదకతల పెంపుతో పాటు రైతులకు, వినియోగదారులకు కూడా ప్రయోజనాలు కలిగించే విధంగా ఇరు సంస్థలు కలిసి పనిచేయాలన్నారు.
వరిలో కార్భన్ క్రెడిట్ ద్వారా రైతుల మరింత ఆర్థికపరమైన ప్రయోజనం కలిగించే విధానాలపై దృష్టి నిలపాలన్నారు. ప్రస్తుతం తెలంగాణ 5 మిలియన్ టన్నుల మేర వరి ధాన్యం మిగులు ఉత్పత్తి చేస్తోందని, అందుకు ఎగుమతులే సరైన విధానమని, రైతులను అటువైపు మళ్లించడానికి అవసరమైన సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రపంచంలో వరి ధాన్యాన్ని దిగుమతి చేసుకునే దేశాలలో అత్యంత ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశమైన ఫిలిప్పున్స్ కు మన రాష్ట్రం నుండి ఎగుమతి చేయడానికి ఉన్న అద్భుత అవకాశాలను వినియోగించుకునే విధంగా వరి పంట సాగును ఒక ఆధునికమైన పరిశ్రమగా మార్చే అవకాశాలు న్నాయని అభిప్రాయపడ్డారు.
దీనికి అనుగుణంగా రెండు సంస్థలు తదనుగుణంగా పనిచేయాల్సిన ఆవశ్యకతను గుర్తించాలని తెలిపారు. కార్యక్రమంలో భారతీయ వరి పరిశోధన సంస్థ సంచాలకులు డాక్టర్ ఆర్. మీనాక్షి సుందరం మాట్లాడుతూ..
రైతులకు మేలైన సేవలు అందించేందుకు ఇరు సంస్థలు సమన్వయంతో పనిచేసేందుకు ఈ అవగాహన ఒప్పందం దోహదం చేస్తుందన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, ఐ ఐ ఆర్ ఆర్ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.