calender_icon.png 11 October, 2024 | 8:53 PM

రాష్ట్రానికి మరో 4 మెడికల్ కాలేజీలు

11-09-2024 03:29:45 AM

ఇప్పటికే 4 కళాశాలలకు అనుమతులు

8 కళాశాలల్లో 400 ఎంబీబీఎస్ సీట్లు

రాష్ట్ర ప్రజలకు ఇది శుభవార్త : మంత్రి రాజనర్సింహ

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): రాష్ట్రంలో 4 మెడికల్ కళాశాలల అనుమతుల కోసం ఎదురుచూస్తున్న వేళ నేషనల్ మెడికల్ కౌన్సిల్ శుభవార్త అందించింది. యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ దరఖాస్తు చేసిన 4 కాలేజీలకు పర్మిషన్ ఇవ్వాలని నేషనల్ మెడికల్ కమిషన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది.

ఇదే విషయాన్ని తెలుపుతూ రాష్ర్ట ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం లేఖ పంపించింది. ఒక్కో కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున, మొత్తం 200 సీట్లు ఈ కాలేజీల్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ములు గు, నర్సంపేట, గద్వాల్, నారాయణపేట మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి ఇచ్చింది. మొత్తం 8 కాలేజీల్లో కలిపి 400 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వ కాలేజీల్లోని మొత్తం సీట్ల సంఖ్య 4,090కి పెరిగింది.

మొదట తిరస్కారం.. అనంతరం అనుమతి

ఈ ఏడాది మొత్తం 8 కాలేజీలకు ప్రభు త్వం దరఖాస్తు చేసింది. జూన్‌లో ఈ కాలేజీల పరిశీలనకు వచ్చిన ఎన్‌ఎంసీ అధి కారులు, ఇక్కడ కాలేజీల ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. టీచింగ్ స్టాఫ్, సౌకర్యాలు లేకుండా అనుమతులు ఇవ్వలేమని స్పష్టం చేశారు. అధికారులు ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకురావడంతో, అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఎన్‌ఎంసీ లేవనెత్తిన లోపాలను సవరించి ఫస్ట్ అప్పీల్‌కు వెళ్లింది. ఈ తర్వాత ములుగు, నర్సంపేట, గద్వాల, నారాయణపేట్ కాలేజీలకు అనుమతి ఇచ్చిన ఎన్‌ఎంసీ, మిగిలిన 4 కాలేజీలకు నో చెప్పింది.

ఈ కాలేజీల అనుమతులపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ప్రత్యేక చొరవ తీసుకొన్నారు. యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ కాలేజీలకు స్టాఫ్‌ను నియమించేలా అధికారులను ఆదేశించారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో ఆ నాలుగు కాలేజీల్లోని ఖాళీలను నింపిన తర్వాతే, మిగిలిన కాలేజీల్లోకి స్టాఫ్‌ను బదిలీ చేశారు. ప్రొఫెసర్ల కొరతను అధిగమించేందుకు అర్హత ఉన్న వారికి ప్రమోషన్లు ఇప్పించారు. కాలేజీ, హాస్పిటల్‌లో ఉండాల్సిన లాబోరేటరీ, డయాగ్నస్టిక్స్ పరికరాలు కొనుగోలు చేసేందుకు నిధులు కేటాయించారు. ఇలా ఎన్‌ఎంసీ లేవనెత్తిన అన్ని లోపాలను సవరించి కేంద్ర ఆరోగ్యశాఖకు సెకండ్ అప్పీల్ చేశారు.

సీఎం రేవంత్‌రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశాలతో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, డాక్టర్ వాణి, ఇతర ఆఫీసర్లు, డాక్టర్ల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆరోగ్యశాఖ, ఎన్‌ఎంసీ అధికారులను కలిశారు. కాలేజీల ఏర్పాటుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని, ఇంకేమైనా అవసరం ఉంటే అవి కూడా సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. ఈ నేపథ్యంలోనే మిగిలిన కాలేజీలకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. లెటర్ ఆఫ్ పర్మిషన్ జారీచేయాలని ఎన్‌ఎంసీని ఆదేశించింది.

తెలంగాణ ప్రజలకు శుభవార్త : దామోదర

రాష్ట్రంలోని వైద్య విద్య కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు, ప్రజలకు కొత్తగా 4 మెడికల్ కళాశాలల మంజూరు విషయం శుభవార్త అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మొదటి అప్పీల్‌లో 4 కళాశాలలు, రెండో అప్పీల్‌లో మరో 4 మెడికల్ కళాశాలలు మంజూరైనట్లు వెల్లడించారు. ప్రతి కళాశాలలో 50 చొప్పున మొత్తం 400 ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయని తెలిపారు. రాష్ట్రంలో వైద్య విద్య మరింతగా విస్తరిస్తోందని స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.