calender_icon.png 27 October, 2024 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీ మాస్టర్ ప్లాన్‌కు రీటెండర్

08-08-2024 03:18:06 AM

గతంలో వచ్చిన 5 ఇంటర్నేషనల్ ఏజెన్సీలపై ఆసక్తి చూపని ప్రభుత్వం 

10 రోజుల్లో మరోసారి నోటిఫికేషన్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 7 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో బృహత్తర మైన ప్రాజెక్ట్‌గా ప్రజల ముందుకు రాబోతున్న మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్‌డీసీఎల్) పనులు ఒక్కొక్కటిగా వేగవంతం అవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ పనుల ప్రారంభానికి ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతం అంతటా 33  రెవెన్యూ బృందాలతో నిర్వహిస్తున్న సామాజిక సర్వే ముగియనుంది.

ఒకవైపు ఈ సర్వే జరుగుతుండగానే మూసీ సుందరీకరణకు అవసరమైన నిధుల కోసం ఎంఆర్‌డీసీఎల్ అన్వేషణ ప్రారంభించింది. ఇదిలా ఉండగా ప్రభుత్వం అనుకుంటున్నట్టుగా మూసీ బ్యూటిఫికేషన్, పర్యావరణ హితమైన మోడల్స్‌ను రూపొందించడానికి కసరత్తు చేపడుతుంది. అందులో భాగంగానే మూసీపై అగ్రిగేటెడ్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడానికి అంతర్జాతీయ స్థాయి ఏజెన్సీలను టెండర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించనుంది.  

అగ్రిగేటెడ్ మాస్టర్ ప్లాన్..  

మూసీ సుందరీకరణ, పరివాహక ప్రాంతంలో వివిధ జోన్లను ఏర్పా టు చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించడంతో పాటు పలు వాణి జ్య కేంద్రాల ఏర్పాటుకు అనువైన ప్రదేశాన్ని సిద్ధం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. మూసీ పరిసరాలలోని చారిత్రాత్మక ప్రదేశాలను పరిరక్షిస్తూనే మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి చేయడానికి పూనుకుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా మొత్తం మూసీ పరిధిలో వెస్ట్ నుంచి ఈస్ట్ దాకా 110 కిలోమీటర్ల విస్తీర్ణంలో వివిధ జోన్లుగా విభజన చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు.

అందులో భాగంగా కమర్షి యల్, టూరిజం డెవెలప్‌మెంట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించడం, ఈస్ట్ నుంచి వెస్ట్ కారి డార్ కనెక్టివిటీలో భాగంగా బ్రిడ్జిలు, రోడ్లు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, మూసీ పునరుజ్జీవానికి చర్యలు చేపట్టనున్నారు. మూసీ పరివాహక ప్రాంతా న్ని పర్యావరణ హితం గా తీర్చిదిద్దడం, చారిత్రాత్మక, సాంస్కృతిక వారసత్వ సంపద పెంపొందేలా, ఇక్కడ ఏర్పాటు చేసే వాణిజ్య కేంద్రాలతో ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడంతో పాటు తదితర అంశాలతో హైదరాబాద్ ఇమేజ్ విశ్వవ్యాప్తం చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు.

మరికొద్ది రోజుల్లో రీటెండర్..

మూసీ సుందరీకరణ కోసం చేపడుతున్న ప్రాజెక్ట్‌ను డిజైన్ చేసేందుకు అగ్రిగే టెడ్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి ఏజెన్సీల నుంచి టెండర్లను ఆహ్వానిస్తూ ఫిబ్రవరిలో టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు అనుగుణంగా టెండర్ ప్రక్రియలో పాల్గొనడానికి మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కోసం మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ రూపంలో అగ్రిగేటెడ్ మాస్టర్ ప్లాన్ కావాలంటూ ఓ డాక్యుమెంట్‌ను టెండర్‌కు జోడించారు.

ఈ ప్రకారం టెండర్ వేసేందుకు వచ్చిన అంతర్జాతీయ స్థాయి ఏజెన్సీలు ప్రదర్శించిన ప్రజెంటేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు సంతృప్తి చెందకపోవడంతో ఆ టెండర్ ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో మరోసారి అంతర్జాతీయ స్థాయి ఏజెన్సీలను టెండర్లకు పిలవాలని ఎంఆర్‌డీసీఎల్ భావిస్తోంది. ఈ రీకాల్ టెండర్లకు మరో 10 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా విశ్వసనీయ సమా చారం. ఈ మేరకు ఇంజినీరింగ్ విభాగం కసరత్తు చేపడుతుంది.