11-04-2025 12:00:00 AM
మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బీఎల్.రాజు
ముషీరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): రాజ్యాంగ నిబంధనలు పాటించని తెలంగాణ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదించడం వెనుక కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కార్ హస్త ఉందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ బీఎల్ రాజు ఆరోపించారు. ఈ మేరకు గురువారం హిమాయత్ నగర్ లోని మాల మహానాడు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళిత కులాల్లో ఉన్న మెజార్టీ మాల ఉప కులాలను అణిచి వేసి వారి ప్రయోజనాలను దెబ్బతీసి, మిగతా ఎస్సీ మాదిగకులాలకు లబ్ది చేకూర్చడం కోసమే నని అన్నారు.
అంతిమంగా మొత్తం దళిత సమాజాన్ని బానిసత్వం చేసుకోవడం కోసమే ఈ వర్గీకరణ ను తీసుకొచ్చారని, ఇది ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమేనని విమర్శించారు. వర్గీకరణ మీద గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం తెలంగాణ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉల్లంఘించారన్నారు. ఈ వర్గీకరణతో మాల ల భవిష్యత్తును దెబ్బతీశారని ఆందోళన వ్యక్తం చేశారు.
అసమగ్రమైన ఎస్సీ వర్గీకరణను అడ్డు కోవడంలో మాల ప్రజా ప్రతినిధులు మంత్రు లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విఫలం చెందారని జాతికి ద్రోహం చేశారని, ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడైపోయారని విమర్శించారు. మెజార్టీ ఎస్సీ కులాలకు నష్టం చేకూర్చే తెలంగాణ ఎస్సీ వర్గీకరణ బిల్లు గవర్నర్ ఆమోద చట్టాన్ని ఉన్నత న్యాయ స్థానంలో సవాల్ చేస్తామని డాక్టర్ వి ఎల్ రాజు ప్రకటించారు.
తెలంగాణలో మాల జాతికి వెన్ను పోటు పొడిచిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ను, కాంగ్రెస్ బిజెపి పార్టీలను బొంద పెట్టాలని డాక్టర్ వి.ఎల్. రాజు మాల సమాజానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్, మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి సంకు శ్రీనివాసులు, తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు జే.ఎన్.రావు తదితరులు పాల్గొన్నారు.