calender_icon.png 21 September, 2024 | 12:11 PM

74వ పడిలోకి మోదీ

18-09-2024 04:22:28 AM

  1. జన్మదిన శుభాకాంక్షల వెళ్లువ 
  2. మోదీ బహుమతుల వేలం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారంతో 74వ వసంతంలోకి అడుగుపెట్టారు. 74వ జన్మదినం సందర్భంగా ప్రధానికి పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. నరేంద్రమోదీ 1950 సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని వడోధరలో జర్మించారు. ‘శక్తిమంతమైన వ్యక్తిత్వం, కఠిన శ్రమతో మీరు అందించిన అద్భుతమైన నాయకత్వం దేశాన్ని ఉన్నతంగా నిలిపాయి’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

జన్మదినం సందర్భంగా మోదీ సంకల్పం, అకుంటిత దీక్ష భారతదేశాన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లాయని బీజేపీ నేతలు కొనియాడారు. ‘ప్రజాసంక్షేమం పట్ల ఆయనకు ఉన్న శక్తిమంతమైన సంకల్పం ఎన్నో అసాధ్యమైన పనులను సుసాధ్యం అయ్యేలా చేసింది. పేదల సంక్షేమంలో కొత్త రికార్డులు నెలక్పొంది’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. ‘మీ నాయకత్వంలో మన లక్ష్యాలైన సేవ, సుపరిపాలన, అభివృద్ధి మరింత ద్విగుణీకృతమయ్యాయి’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ట్వీట్ చేశారు.

ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్‌లో మోదీ సైకత శిల్పాన్ని మలిచి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రలు, బీజేపీ నేతలు మోదీకి శుభాకాంక్షలు చెప్పారు. తన 74వ జన్మదినం రోజును ప్రధాని మోదీ ఒడిశాలో పేదలతో గడిపారు. మంగళవారం భువనేశ్వర్‌లో పర్యటించిన ఆయన సుభద్ర యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం లబ్ధిదారులైన మురికివాడల్లోని పేదలతో ముచ్చటించారు. సుభద్ర యోజన పథకం కింద పేద మహిళలకు ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం చేస్తారు. దాదాపు కోటి మంది పేద మహిళలు ఈ పథకంతో లబ్ధి పొందనున్నారు. 

మోదీ బహుమతులు వేలం

మోదీ 74వ జన్మదినం సందర్భంగా ప్రధాని హోదాలో ఆయనకు లభించిన దాదాపు 600 బహుతుల వేలాన్ని మంగళవారం ప్రారంభించారు. అక్టోబర్ రెండో తేదీ వరకు ఈ వేలంపాట కొనసాగుతుంది. ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ వేలంలో దేశంలోని ఎవరైనా పాల్గొని ఆ అరుదైన బహుమతులను సొంతం చేసుకోవచ్చు. pmmementos.gov.in  వెబ్‌సైట్‌లో ముందుగా రిజస్టిర్ చేసుకొని వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది.