calender_icon.png 17 October, 2024 | 3:04 AM

మోడ్రన్ రామాయణం!

08-10-2024 12:00:00 AM

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, దర్శకుడు రోహిత్ శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సింగం’, సింగం రిటర్న్స్’ సిరీస్‌లో మూడో భాగంగా తెరకెక్కిన చిత్రం ‘సింగం అగైన్’. ‘సింగం’ సిరీస్ ఆధారంగా చేసుకుని రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ అనే ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేశాడు. అందులో ‘సూర్యవంశీ’, ‘సింబా’ సినిమాలూ ఉన్నాయి.

ఇప్పుడు ఈ సిని మాలన్నిటిలోని పాత్రలన్నీ ఒకచోటుకు తెస్తూ ‘సింగం అగైన్’ను తీసుకువచ్చాడు. ఈసారి లేడీ సింగం అంటూ దీపిక పదుకొణెని కూడా పట్టుకొచ్చాడు. అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సోమవారం ట్రైలర్‌ను విడుదల చేసింది.

పురాణ గాథ రామాయణం ఆధారంగా ‘సింగం అగైన్’ తెరకెక్కిందని ఎలాంటి కంగారు లేకుండా ట్రైలర్ ప్రారంభంలోనే చెప్పేశాడు దర్శకుడు. అజయ్ దేవగన్ భార్య పాత్ర పోషించిన కరీనా కపూర్‌ను విలన్ పాత్ర పోషించిన అర్జున్ కపూర్ ఎత్తుకుపోవడం.. భార్యను తిరిగి తెచ్చుకోవడానికి బాజీరావ్ సింగం చేసే ప్రయత్నాలే ఈ సినిమా కథ అని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

రామాయణంలోని పాత్రలను ప్రతిబింబించే పాత్రలను కూడా ఇందులో చూపించారు. లక్ష్మణుడిగా టైగర్ ష్రాఫ్, ఆంజనేయుడిగా రణ్‌వీర్ సింగ్, జటాయువుగా అక్షయ్ కుమార్ చూపించారు. దీపికా పదుకోణేల పాత్ర కూడా చాలా బలంగా కనిపిస్తుంది. రావణుడి పాత్రలో అర్జున్ కపూర్ అత్యంత క్రూరంగా చూపించారు.