హైదరాబాద్ (విజయక్రాంతి): రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ సందర్భాల్లో పోగొట్టుకున్న దాదాపు 1400 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్టు సీపీ జి.సుధీర్బాబు తెలిపారు. ఈ మేరకు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (సీఈఐఆర్) పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్న బాధితులకు చెందిన మొబైల్ ఫోన్లను సీసీఎస్, ఐటీ విభాగం అధికారులు రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. సుమారు రూ. 3 కోట్లు విలువ చేసే 1400 ఫోన్లలో.. ఎల్బీనగర్ జోన్లో 655, మల్కాజిగిరి జోన్లో 290, భువనగిరి జోన్లో 71 ఫోన్లను గురువారం బాధితులకు అందజేశారు.
మొబైల్ ఫోన్లను రికవరీ చేయడంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రైమ్ డీసీపీ వి. అర్వింద్ బాబు, ఏసీపీ కరుణాసాగర్, సీసీఎస్, ఐటీ విభాగాల స్పెషల్ టీం అధికారులు, సిబ్బందిని సీపీ సుధీర్ బాబు అభినందించారు. మొబైల్ ఫోన్లలో మీ వ్యక్తిగత సమాచారాన్ని నేరస్తులు వినియోగించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చోరీ చేసిన ఫోన్లను నిందితులు వినియోగించే అవకాశం లేకుండా బలమైన పాస్వర్డ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు.