18-03-2025 01:42:45 AM
బీసీ బిల్లుపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వినతి
హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి):- తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సోమవారం అసెంబ్లీ ఆవరణలోని బీఆర్ఎస్ఎల్పీ ఆఫీసులో కేటీఆర్, హరీశ్రావులతో భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
బీసీ బిల్లుకు కేంద్రం చట్టబద్ధ్దత కల్పించాలని ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద తాము చేపట్టబోయే దీక్షలో సీఎం రేవంత్ పాల్గొనేలా అసెంబ్లీలో ఒత్తిడి తీసుకురావాలంటూ మల్లన్న బీఆర్ఎస్ నేతలకు వినతిపత్రం అందజేశారు.
బీసీ రిజర్వేషన్ల బిల్లుపై సభలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికైన తీన్మార్ మల్లన్న ఇటీవల ఆ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన తెలిసిందే. కుల గణన విషయంలో ప్రభుత్వ లెక్కలు తప్పు అని, ఒక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంగా మల్లన్న కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ లేదా బీజేపీలో చేరుతారని, సొంతంగా పార్టీ పెట్టుకుంటారని ప్రచారం జరుగుతోంది.