14-04-2025 04:58:53 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): అంబేద్కర్ జయంతి నాడు దళితులపై జరిగిన దారుణం ఊహించలేనిదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు ఎంత సిగ్గుచేటు అని ఆగ్రహ్యం వ్యక్తం చేశారు. ఇది అమలులో ఉన్న డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమా లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత నియమాల పుస్తకమా? అని కవిత ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో దళితులను పోలీసులు బట్టలు విప్పి, అవమానించి అరెస్టు చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా పోలీసులు అరెస్టు చేసిన నలుగురు దళితుల జాడ ఎక్కడ, వారిని ఎక్కడ నిర్బంధించారని అడిగారు.
పోలీసులు ప్రజా సేవకులలా కాకుండా అరాచక గుంపుల్లా ప్రవర్తించారు. పై నుండి రక్షణ ఉందని తెలియకపోతే, ఏ పోలీసులు ఇలాంటివి చేయడానికి ధైర్యం చేస్తారని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యమా.. ఆటవిక రాజ్యమా?, ఈ అమానవీయ చర్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కవిత తన ఎక్స ఖాతలో వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, బాధ్యులపై ఆలస్యం లేకుండా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని, ప్రభుత్వం దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది శాంతిభద్రతల సమస్య కాదు, లక్ష్యంగా చేసుకున్న అణచివేత. దాడికి గురైన ఏ గొంతును కూడా మేము నిశ్శబ్దం చేయనివ్వమని కవిత వ్యాఖ్యానించారు.