calender_icon.png 18 April, 2025 | 9:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాళ్ల పేర్లను బరాబర్ పింక్ బుక్కులో రాసుకుంటాం: ఎమ్మెల్సీ కవిత

15-04-2025 06:21:00 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): బాన్సువాడలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లవద్దని కొంత మంది ఫోన్లు చేసి బెదిరించారని, ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లను బరాబర్ పింక్ బుక్కులో రాసుకొని వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తూ కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్లకు ఈడ్చిన వాళ్లు కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఎవరైనా ఊరుకునేదే లేదని తెలిపారు. కాంగ్రెస్ నాయకుల తాటాకు చప్పుళ్లకు భయపడేదే లేదని, వాళ్ల తాతలు, ముత్తాతలు, జేజమ్మలు ఎవరు దిగొచ్చినా కూడా ఇక్కడ భయపడేవాళ్లెవరూ లేరని సవాలు చేశారు. 

మాట తప్పడమే... మడమ తిప్పడమే కాంగ్రెస్ నైజం అని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంతకాలు పెట్టిన గ్యారెంటీ కార్టులను కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి పంచి ఓట్లేయించుకున్నారని కవిత విమర్శించారు.  ఇప్పుడు గ్యారెంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి పదేళ్ల పాటు అరిగోస పెట్టిందని, వందలాది మంది తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాలకు కారణమైందన్నారు. ఏడాదిన్నర పాలనలోనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నోబుల్ ప్రైజ్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు. ప్రతీ ఇంటి నుంచి ఒకరు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రావాలని పిలుపునిచ్చారు.  తెలంగాణ గడ్డ మీద అగ్గిపెట్టించి రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని గుర్తు చేశారు. 

బీఆర్ఎస్ పార్టీ నలిగిపోయిన ఆత్మగౌరవాన్ని రెపరెపలాడించిందని, స్వతంత్ర దేశంలో లక్ష్యాన్ని చేరిన ఒకైక పోరాటం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ఉద్యమం మాత్రమే అని కొనియాడారు. వీరులు మాత్రమే లక్ష్యం చేరే వరకు పోరాటం చేస్తారు... అది కేసీఆర్ తో మాత్రమే సాధ్యమైందన్నారు. ప్రజాస్వామ్య పంథాను నమ్ముకొని అహింసాయుతంగా పోరాటం చేసి తెలంగాణ సాధించామని, త్యాగాలతో తెలంగాణ కోసం కేసీఆర్ మొదటి అడుగు వేశారు. కేంద్ర మంత్రి పదవిని సైతం గడ్డిపోచలా వదిలేసిన ఘనత కేసీఆర్ ది అని చెప్పారు. ఎవరో భిక్షపెడితేనో, ఎవరో దయదలచి ఇస్తే తెలంగాణ రాలేదని, కేసీఆర్ త్యాగం, కృషి, పోరాటపటిమ వల్ల తెలంగాణ సాధ్యమైందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో కటిక చీకటి వస్తుందని, నక్సలైట్ల రాజ్యం వస్తుందని అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నామాటలను సభ వేదికగా చెప్పారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత వెలుగు జిలుగుల, కోటి ఎకరాల మాగాణను, తెలంగాణను తయారు చేసుకున్నామన్నారు. కేసీఆర్ సాగు నీళ్ల పన్ను మాఫీ చేసి రైతు బంధు, రైతు బీమా వంటి అనేక కార్యక్రమాలను చేపట్టి రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు వడ్లు కొని చరిత్ర సృష్టించారని కవిత వివరించారు.