28-03-2025 07:00:50 PM
దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపు
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): మహబూబ్ నగర్ విద్యానిధికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తన నెల జీతం నుంచి ఒక లక్ష రూపాయల చెక్కును శుక్రవారం జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... మహబూబ్ నగర్ విద్యానిధిని జనవరిలో ప్రారంభించిన సందర్భంగా ప్రతి నెలా తనకు వచ్చే జీతం నుంచి లక్ష రూపాయలు విరాళం ఇస్తానని ప్రకటించారు. విద్యా నిధి ఏర్పాటు చేసిన సందర్భంగా లక్ష రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ కి అందజేశామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ తన నెల జీతం నుంచి ఒక లక్ష రూపాయల చెక్కును మహబూబ్ నగర్ విద్యా నిధికి జిల్లా కలెక్టర్ని కలిసి అందజేశారు. విద్యా నిధి అనేది మన మహబూబ్ నగర్ పిల్లల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రభుత్వం విద్యాసంస్థల్లో చదివే పిల్లలకు ఈ మహబూబ్ నగర్ విద్యానిధి చాలా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన వ్యాపారవేత్తలు, విద్యావంతులు, ఉద్యోగులు విద్యా నిధికి విరివిగా విరాళాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, సిజె బెనహర్, శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.