calender_icon.png 11 October, 2024 | 12:45 AM

సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్

10-10-2024 10:18:48 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి):  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు పండించిన పంటలకు కనీసం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నప్పుడు దళారుల వద్ద పంటలు అమ్మి మోసపోవద్దని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం జైనథ్, బేల మండలాల్లో సోయా కొనుగోలు కేంద్రాలను మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ముందుగా తూకం కాంటాలకు ప్రత్యేక పూజలు చేసి, పంటను తీసుకువచ్చిన తొలి రైతులు సన్మానించి కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో కష్టపడి పండిస్తున్న పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ఇస్తున్నాదని తెలిపారు. పంట కొనుగోలు విషయంలో రైతులకు ఏ ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోన్ ద్వారా అదిలాబాద్ రైతులు కేవలం 6 క్వింటాలే సోయ కొనుగోలు విషయంలో మాట్లాడడం జరిగిందన్నారు. స్పందించిన మంత్రి 6 క్వింటాలు కాకుండా పది క్వింటాలు సోయ కొనుగోలు చేసేలా ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. పంటలు అమ్మడానికి వచ్చే రైతులకు కోసం ఉచితంగా పాయల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత అన్నదానం కార్యక్రమాన్ని చేపడతామన్నారు. పంట చేను కు ఫెన్సింగ్ కు 20% రైతులు పెట్టుబడి పెడితే మిగతా శాతం పెట్టుబడి ప్రభుత్వమే భరించేలా ఒక పథకాన్ని ప్రారంభించే ఆలోచనల ఉందన్నారు.

ఒకవేళ ఈ పథకానికి రైతులు మద్దతు కావాలని అన్నప్పుడు తప్పకుండా సంఘీభావం తెలపడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రైతు సమస్యలు ఉన్నప్పటికీ రాజకీయాలను పక్కనపెట్టి రైతుల సమస్యల పరిష్కారం చేసేలా తన వంతు కృషి చేస్తానని భరోసాని ఇచ్చారు. చేనులకు వెళ్లే దారులను రోడ్లుగా మార్చేందుకు ఒక సర్వే చేయిస్తున్నామన్నారు. ఒకేసారి కాకుండా దశలవారీగా పంటపొలాలకు వెళ్లేందుకు విశాలమైన రోడ్లను నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గోవర్ధన్ రెడ్డి, రాందాస్, సుభాష్, అశోక్ రెడ్డి, ముకుంద రావు, రాకేష్ రెడ్డి, రమేష్, వెంకన్న, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.