calender_icon.png 21 April, 2025 | 4:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘పబ్లిసిటీ’లో వెనుకబడుతున్నాం..

21-04-2025 11:40:44 AM

గిట్లయితే స్థానిక ఎన్నికల్లో నెగ్గుడు కష్టమే..

జూన్ మొదటి వారంలో స్థానిక ఎన్నికలు

అప్పట్లోగా ప్రచారంలో ముందుండాలి: ఎమ్మెల్యే మురళి నాయక్ 

మహబూబాబాద్, (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోంది.. సంక్షేమ, అభివృద్ధి ఫలాలను పేద ప్రజలతో పాటు మన కార్యకర్తలు, నాయకులు అందుకుంటున్నారు. అయితే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆశించిన పబ్లిసిటీ చేయడం లేదు.. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే స్థానిక ఎన్నికల్లో పరాభవం పాలు కాక తప్పదని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ కార్యకర్తలు, నాయకుల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. మానుకోట నియోజకవర్గ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం సందర్భంగా వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో ఎమ్మెల్యే పై విధంగా వ్యాఖ్యానిస్తున్నారు. 

గృహాలకు ఉచితంగా నెలకు 200 యూనిట్ల విద్యుత్ పథకం, సన్నధాన్యానికి బోనస్, మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, రైతులకు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, రాజీవ్ యువ వికాసంతో పాటు దేశంలో ఎక్కడ లేని విధంగా పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ, ఇతర సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుండగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలు, నాయకులు ఎందుకు వెనుకబడుతున్నారని ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నారు. గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు చేస్తే వెయ్యి రూపాయల పబ్లిసిటీ ఇచ్చుకునేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రూపాయలు ఖర్చు చేస్తే ఒక్క రూపాయి వంతు కూడా ‘పబ్లిసిటీ’ ఇచ్చుకోలేక పోతున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇట్లైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థులు గెలుపొందడం కష్టమని, ఇప్పటికైనా కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలకు విస్తృత ప్రచారం నిర్వహించాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి 18 గంటలు కష్టపడుతున్నారు.. గ్రామాల్లో కనీసం మీరు 10 గంటలు కష్టపడలేరా అంటూ ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో స్థానిక సంస్థల్లో 90 శాతం సీట్లు సాధించే విధంగా కృషి చేయాలన్నారు.

జూన్ మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు

స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయని, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ పూర్తి చేయడం జరిగిందని, జూన్ మొదటి వారం లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవుతుందని, రెండో వారంలో ఎన్నికలు తప్పకుండా జరుగుతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటికైనా స్థానిక నాయకులు, కార్యకర్తలు మేల్కొని వెంటనే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను గడపగడపకు తీసుకువెళ్లి ఎన్నికల్లో గెలుపొందేందుకు కృషి చేయాలన్నారు. గ్రామాల్లో మీరే ఎన్నికల్లో నిలబడేది.. కష్టపడి పని చేయండి.. గెలిపించే బాధ్యత నాదంటూ ఎమ్మెల్యే మహబూబాబాద్ నియోజకవర్గ స్థాయిలో గత రెండు రోజులుగా గ్రామాల్లో నిర్వహిస్తున్న సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కు  హితోపదేశం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం స్థానాల్లో గెలవడానికి గట్టిగా కృషి జరగాలని, లేనిపక్షంలో తాను ఆయా గ్రామాలకు వచ్చే పరిస్థితి ఉండదని స్పష్టం చేస్తున్నారు.