13-03-2025 12:00:00 AM
సంగారెడ్డి, మార్చి 12 (విజయ క్రాంతి): పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ను అసెంబ్లీ లాబీలో కలవడం చర్చనీయాంశంగా మారింది. బుధవారం హైదరాబాద్ లో శాసనసభ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అసెంబ్లీ లాబీలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కలవడంతో సంగారెడ్డి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి తన తమ్ముడు కుమారుడి పెళ్లికి రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారని తెలిసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు పై సుప్రీంకోర్టు ఇటీవల శాసనసభ స్పీకర్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది చర్చనీయంశంగా మారింది. శాసనసభ ఎన్నికల తర్వాత గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పలుమార్లు బీఆర్ఎస్ కు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అనుకూలంగా మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి. క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో తొలగించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు ఆందోళన చేసిన పట్టించుకోలేదు. మాజీ ముఖ్యమంత్రి కలవడంపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని పలువు ఆసక్తిగా చూస్తున్నారు.