కూకట్ పల్లి,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ(SC Classification)ను తక్షణమే అమలు చేయాలని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. బుధవారం కూకట్పల్లి వై జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం డప్పు కొడుతూ ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని కోరారు. లక్ష డప్పులు వేయి గొంతులు కార్యక్రమానికి తాను సంఘీభావం తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్సి వర్గీకరణ చేయాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ ఆమోదించాలని కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి కూడా వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించి సంవత్సర గడిచిన రేవంత్ సర్కార్ అమలు చేయడం లేదని అన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లులు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తుందో స్పష్టత ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.