మంత్రిని కలిసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే
కామారెడ్డి,(విజయక్రాంతి): మారుమూల నియోజకవర్గమైన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించేందుకు ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో బస్సు డిపో ఏర్పాటు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను బుధవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు స్వయంగా కలిసి వినతిపత్రం అందజేశారు. గతంలో బస్ డిపో ఉండేదని, 40 సంవత్సరాల నుండి బస్సు డిపో లేక చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వారి పంటలను విక్రయించుకోవడానికి నియోజకవర్గ కేంద్రమైన ఎల్లారెడ్డికి నిత్యం సుమారు 30 వేలమంది వచ్చి వెళ్తుంటారని వీరికి బస్సు సౌకర్యం లేక ఆటోలో గూడ్స్ వాహనాల్లో ప్రయాణిస్తూ నరకయాతన అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. వీరందరి జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కోసం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రం లో బస్ స్టేషన్ మంజూరు చేసి మారుమూల గ్రామీణ ప్రజలకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. నియోజకవర్గ ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించి ఆదుకోవాలని కోరారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ డిపో ఎల్లారెడ్డి లో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.