మానకొండూర్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం బాలయ్యపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సాయబ్ పల్లెకు చెందిన ఎంబీఏ విద్యార్థిని కామెర సమతకు మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆర్థికంగా చేయూతనందించారు. నేతకాని సామాజికవర్గానికి చెందిన కామెర సంపత్ కుమార్తె సమతను కరీంనగర్ లోని నిగమా కళాశాలలో ఎంబీఏ చదివిస్తున్నాడు. అయితే ఫీజులు కట్టలేని పరిస్థితిలో కాలేజీ మానేసింది. కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శుక్రవారం క్యాంపు కార్యాలయానికి పిలిపించి ప్రథమ సంవత్సరానికి సంబంధించిన ఫీజు మొత్తాన్ని చెక్ రూపంలో సమతకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, పార్టీ నాయకులు ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, తిరుమల్ రెడ్డి, కొండల్ రెడ్డి, జి.రాజేందర్ రెడ్డి, టి.రాజేందర్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, కొత్త తిరుపతిరెడ్డి, ఆసిఖ్ పాషా తదితరులు పాల్గొన్నారు.