అశ్వారావుపేట,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ప్రగతి మండల సమైక్య సభ్యులకు బ్యాంకు లింకేజీ ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం బ్యాంకు లింకేజీ ద్వారా పలు యూనిట్లకు మంజూరైన నాలుగు కోట్ల ఇరవైనాలుగు లక్షల రూపాయల నిధులకు సంబంధించినటువంటి చెక్కును స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేతులమీదుగా లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ... ఈ నిధులను మంచిగా వినియోగించుకుని ప్రగతి మండల సమాఖ్య సంఘాల మహిళలు ఆర్థికంగా ముందుకు వెళ్లాలన్నారు.
రాబోయే రోజుల్లో మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే గంజాయి, డ్రగ్స్ మత్తు పదార్థాల వల్ల ఇటీవల యువత పక్కదారి పడుతున్నందున మహిళా సంఘాలు కూడా మారకద్రవ్యాల నియంత్రణలో తోడ్పాటు ఇవ్వాలని, డ్రగ్స్ నిర్మూలనకు అధికారులకు సహకరించాలని సూచించారు. అనంతరం అశ్వారావుపేట మండల గ్రామ పంచాయతీ కార్యాలయంలో దసరా, దీపావళి పండగలను పురస్కరించుకుని కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి స్థానిక మహిళలకు చీరలు అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, బ్యాంక్ అధికారులు, మహిళా శక్తి సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.